ఎల్లారెడ్డి రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైనందున ఇండ్ల ఆవరణలో నాటేందుకు మొక్కలను పంపిణీ చేయాలని ఎంపీవో అతినారపు ప్రకాశ్ అన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని సోమార్పేట్, మౌలాన్ఖేడ్ గ్రామాల్లోని నర్సరీలను ఆయన బుధవారం పరిశీలించారు. నర్సరీలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు, గడ్డి పెరగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట సోమార్పేట్ పంచాయతీ కార్యదర్శి రమేశ్, మౌలాన్ఖేడ్ పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత ఉన్నారు.
నర్సరీ, పల్లెప్రకృతి వనం పరిశీలన
మద్నూర్, జూన్ 16 : మండలంలోని కోడిచిర, చిన్నఎక్లారా గ్రామాల్లో నర్సరీ, పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలను ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. పల్లె ప్రకృతివనాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. అనంతరం పంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
గుంతల పరిశీలన
సదాశివనగర్, జూన్ 16 : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, కుప్రియాల్, మర్కల్, సదాశివనగర్, మల్లుపేట్, పద్మాజివాడి, కల్వరాల్, దగ్గి గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలు బుధవారం గుంతలు తవ్వారు. గుంతలను ఎంపీడీవో కలం రాజ్వీర్ పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారికి రోడ్డుకు ఇరువైపులా ఐదు వరుసల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్విస్తున్నట్లు తెలిపారు.అటవీ శాఖ, ఉపాధి హామీ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో మొక్కలు నాటి పెంచుతామన్నారు. ఆయన వెంట ఏపీవో పట్నం శృతి, అడ్లూర్ ఎల్లారెడ్డి పంచాయతీ కార్యదర్శి రాజు తదితరులు ఉన్నారు.