ఏడోవిడత హరితహారానికి ఏర్పాట్లు
భద్రాద్రి జిల్లాలో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలు
జిల్లా అధికారులతో కలెక్టర్ అనుదీప్ సమీక్షలు
కొత్తగూడెం, జూన్ 16: ఏడో విడత హరితహారానికి భద్రాద్రి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. గ్రామాల్లోని నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను అంచనా వేస్తూ కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.. ఇంటింటికీ మొక్కలు అందించి ప్రజలను సైతం భాగస్వాములను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, పోలీస్స్టేషన్లు, రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..
ఇప్పటి వరకు చేపట్టిన చర్యలతో జిల్లా అంతా పచ్చదనంగా మారుతున్న తరుణంలో ఏడో విడత హరితహారానికీ భద్రాద్రి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పల్లెపకృతి వనాలతో కళకళలాడుతున్న గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పెంచి ఊరూవాడా మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. ‘హరితహారంలో మొక్కలు నాటండి’ అని సీఎం కేసీఆర్ ఇప్పటికే పిలుపునివ్వడంతో కలెక్టర్ అనుదీప్ సంబంధిత శాఖల అధికారుతో సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరుడు కూడా హరితహారంలో విరివిగా మొక్కలు నాటి సక్సెస్ అయిన యంత్రాంగం మళ్లీ ఈ ఏడాది మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. దీనికి తోడు రుతుపనవనాలు ప్రారంభం కావడంతో జిల్లా అంతా చల్లబడింది. ప్రతీ పంచాయతీలోని నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు అన్ని శాఖల కార్యాలయాల్లో కూడా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నాటాల్సిన మొక్కలను నర్సరీలలో సిద్ధంగా ఉంచారు. ఈ కార్యక్రమం ఆరు విడతలుగా విజయవంతంగా కొనసాగుతున్నది.
1.05 కోట్ల మొక్కలు నాటేలా..
హరితహారం కోసం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను పెంచారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో 50 వేలు, సింగరేణి ఆధ్వర్యంలో 10 లక్షలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 3 లక్షలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 48.10 లక్షలు, జలవనరులశాఖ ఆధ్వర్యంలో 30 వేలు, ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో 2 లక్షలు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో లక్ష, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 50 వేలు, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 30 వేలు, ఐటీడీఏ ఆధ్వర్యంలో 6,270, సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 500, ఎస్సీ హాస్టల్స్ ఆధ్వర్యంలో 1000, మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో 2 వేలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5,141, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 1200, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 వేలు, రెవెన్యూ ఆధ్వర్యంలో 1000, డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 2,500, ఎల్డీఎం (బ్యాంక్స్) ఆధ్వర్యంలో 500, విద్యుత్శాఖ ఆధ్వర్యంలో 5000, టీఎస్ఎఫ్డీసీ (కొత్తగూడెం) ఆధ్వర్యంలో 1.62 లక్షలు, టీఎస్ఎఫ్డీసీ (పాల్వంచ) ఆధ్వర్యంలో 2.70 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5,18,841 మొక్కలు, ఇల్లెందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,19,265 మొక్కలు, మణుగూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,08,600 మొక్కలు, పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5,21,311 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
4.81 లక్షల మొక్కలు నాటుతాం..
డీఆర్డీఏ ఆధ్వర్యంలో 4.81 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచాం. వానకాలం ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గత ఏడాది కూడా వంద శాతం మొక్కలు నాటి సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఏడో విడతకూ సిద్ధంగా ఉన్నాం.
-మధుసూదనరాజు, డీఆర్డీవో, కొత్తగూడెం