20 మందిపై కేసు..16 బైక్లు స్వాధీనం
కురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెంలో మంగళవారం జరిగింది. మృగశిర కార్తె సందర్భంగా స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్దసంఖ్యలో జనం చేపలు పడుతున్నారు. మత్స్యకారులు ఎంతచెప్పినా వినకుండా చెరువును లూటీ చేశారు. సమాచారం తెలుసుకొన్న మరిపెడ సీఐ సాగర్ నేతృత్వంలో ఎస్సైలు సంతోష్రావు, రాణాప్రతాప్ సిబ్బందితో అక్కడికి చేరుకొన్నారు. పోలీసులను చూసిన జనం పరుగులు తీశారు. చెరువు కట్టపై ఉన్న 16 బైకులను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మత్స్యకారుల ఫిర్యాదుమేరకు 20 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంతోష్రావు తెలిపారు.