హైదరాబాద్, జూన్ 06 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఉగాండా, జాంబియాకు చెందిన ఇద్దరు మహిళలు రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ) అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాండా దేశస్థురాలు ఒకరు కొద్దిరోజుల కిందటే హైదరాబాద్ వచ్చారు. తాను పోగొట్టుకున్న బ్యాగేజిను తీసుకెళ్లేందుకు శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి రాగా, డీఆర్ఐ అధికారులు ఆమెపై నిఘాపెట్టారు. మహిళను అదుపులోకి తీసుకుని లగేజీని పరిశీలించగా.. అందులో కొన్ని పౌడర్ ప్యాకెట్లు లభించాయి. వాటిని హెరాయిన్గా గుర్తించారు. మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున జాంబియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికురాలిని అనుమానంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఆమె బ్యాగు అడుగుభాగంలో పైపుల మాదిరిగా ఏర్పాటుచేసిన భాగాల్లో తెల్లని పొడి ప్యాకెట్లు లభించాయి. ఇవి హెరాయిన్ ప్యాకెట్లుగా తేలింది. ఇద్దరి నుంచి మొత్తం 12 కిలోల హెరాయిన్ పట్టుబడగా.. మార్కెట్లో దీని విలువ రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద ఇద్దరిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.