వరిలో వెంకట్రెడ్డి కొత్త ఒరవడి
వెదజల్లే పద్ధతిలో వరి సాగు
కూలీల కొరతకు చెక్..
మిగులుతున్న ఖర్చులు
శంకరపట్నం, మే 30:వరిసాగంటే చిన్నగ కనిపించినా దాని వెనుక పెద్ద కథే ఉంటది. విత్తనాలు తెచ్చుడు, మడి కట్టుడు, నారుపోసి, 15-20 రోజులయ్యాక మొలక తీసి కూలీలతో నాటు వేయించుడు ఉంటది. అదీ రోజుకు నలుగురైదుగురిని పెడితేనే పనైతది. కానీ ఇవన్నీ ఏం లేకుండా.. కేవలం వడ్లు వెదజల్లుతూ వరి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు శంకరపట్నం మండలం చింతగుట్టకు చెందిన రైతు కర్క వెంకట్రెడ్డి. వినూత్న విధానంలో సాగు చేస్తూ కూలీల ఖర్చును ఆదా చేసుకోవడంతోపాటు మంచి దిగుబడులు రాబడుతున్నాడు.
రైతు కర్క వెంకట్రెడ్డి. స్వగ్రామం శంకరప ట్నం మండలం చింతగుట్ట. గ్రామంలో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఒకప్పుడు అందరిలా గా వరి సాగు చేశాడు. అయితే కూలీల కొరత తోడు నాటు వేసేందుకు ఎకరాకు వేల వేలు ఖర్చు అవుతుండడంతో వరిని ఇంకేదైనా పద్ధతిలో సాగు చేయాలని అనుకున్నాడు. సరికొత్తగా ఆలోచించి వెదజల్లే ప్రయోగాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధించాడు. దాదాపు ఆరేళ్లుగా ఈ విధానంలోనే ఎం టీయూ-1010 రకం సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడమేగాక పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నాడు. వ్యవసాయ అధికారుల అభినందనలు అందుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సమయం.. కూలీల ఖర్చు ఆదా
ఈ విధానం ద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతున్నది. నాట్లు ఊపందుకున్నపుడు కూలీల కొరతకు తోడు నాటు వేసేందుకు కూలీల ఖర్చే ఎకరాకు 5-6వేల దాకా అవుతున్నది. డిమాం డ్ ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువే కావచ్చు. కానీ ఈ సరికొత్త పద్ధతిలో ఎవరి అవసరం లేకుండా స్వయంగా రైతే విత్తనాలు వెదజల్లుకోవచ్చు. సాధారణంగా అయితే ముందుగా నారు పోసి 15-20 రోజులు ఆగి ఎదిగాక నాటేస్తారు. కానీ ఇందులో విత్తనాలు నేరుగా వెదజల్లడం వల్ల పం టకాలం కలిసి వస్తుంది. అలాగే విత్తన వినియోగం తక్కువగా ఉంటుంది. నాటు వేస్తే దొడ్డు రకానికి 30కిలోల విత్తనాలు అవసరం. కానీ ఈ విధానంలో 15కిలోలు మాత్రమే అవసరమవుతాయి. ఈ పద్ధతిని ఎంచుకుంటే విత్తనాలు, కూలీల ఖర్చులు మొత్తంగా ఎకరాకు రూ.6వేలు ఆదా అవుతాయి.
సాగు పద్ధతి ఇలా..
కూలీలతో నాటు వేయించడం దానికంటే ఈ పద్ధతి చాలా ఈజీ అని, ఖర్చులు కలిసివస్తాయని వెంకట్రెడ్డి చెబుతున్నాడు. ఎకరాకు 15కిలోల విత్తనాలను 24 గంటలు నానబెట్టి, గోనె సంచిలో మండెకట్టాలి. అనంతరం గొర్రు కొట్టి చదును చేసిన పొలంలో వెదజల్లాలి. ఈ పద్ధతిలో దుక్కి దున్నగానే 65కిలోల డీఏపీ, 15రోజులు గడిచాక 10కిలోల యూరియా చల్లాలి. 25రోజుల వ్యవధిలో ‘వివయా’ అనే కలుపు(గడ్డి) మందును పిచికారి చేయాలి. అలాగే విత్తిన 5రోజుల తర్వాత నీటి ని తీసి పొలాన్ని ఆరబెట్టాలి. తర్వాత నెల రోజుల పాటు నీటి తడులు పెట్టాలి. 45 రోజులకు 50 కిలోల యూరియా, చిరు పొట్ట దశలో 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ చల్లుతున్నానని రైతు వెంకట్రెడ్డి పేర్కొంటున్నాడు.
ఎకరాకు 33 క్వింటాళ్ల దిగుబడి
వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 33 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నాడు వెంకట్రెడ్డి. మొత్తం పదెకరాల్లో 330 క్వింటాళ్ల దిగుబడిని సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ధాన్యం క్వింటాల కు మార్కెట్లో 1,880 చొప్పున ఉండగా, ఈ లెక్కన ఎకరాకు 62వేల ఆదాయం వస్తున్నది. అంటే ఎకరాకు పెట్టుబడి 23వేలు పోను 39 వేల నికర ఆదాయం పొందుతున్నాడు.