న్యూఢిల్లీ, మే 25: కరోనా థర్డ్వేవ్ పిల్లలపై పెను ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి కారణాలూ లేవని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘నేషనల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్ఈఏజీఐ)’ చైర్పర్సన్ డాక్టర్ ఎన్కే అరోరా వెల్లడించారు. అయితే దేశంలో పీడియాట్రిక్ (శిశు సంబంధిత) కొవిడ్ సర్వీస్లను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. థర్డ్వేవ్ను ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నవజాత శిశువులు, పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. పదేండ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలన్నారు. వైరస్ సోకిన గర్భిణులకు ముందుగానే ప్రసవం జరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ట్రీట్మెంట్ ప్రొటొకాల్స్ ఇప్పటికే సిద్ధం అయ్యాయని, వివిధ పీడియాట్రిక్ గ్రూపులు, అసోసియేషన్లు వాటిని సమీక్షిస్తున్నాయని చెప్పారు. ఇదే విషయమై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా స్పందిస్తూ.. మొదటి, రెండో వేవ్ను పరిశీలిస్తే వైరస్ బారిన పడిన పిల్లలు తక్కువేనని, వైరస్ సోకినా కూడా పిల్లల్లో తీవ్రత లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.