సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రజల ప్రాణాలే లక్ష్యంగా.. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే… కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు.. ఉదయం 10 గంటల తర్వాత కూడా ఇష్టానుసారంగా రోడ్డెక్కుతున్నారు.. కనీసం కొవిడ్ నిబంధనలు కూడా పాటించడంలేదు..ఆదివారం అయితే చెప్పనక్కరలేదు.. గుంపులు గుంపులుగా చేరి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా చేపలు, మటన్, చికెన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది.. కొనుగోలు సమయంలో కొందరు మాస్కులు కూడా ధరించడంలేదు..భౌతిక దూరం కూడా పాటించడంలేదు.. ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ మార్కెట్ల వద్ద చూసినా ఆదివారం గుంపులుగా కనిపించడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఇలా ప్రజలు మార్కెట్లలో తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం వచ్చిదంటే చాలు ప్రధాన రహదారులు మినహాయిస్తే.. కాలనీలు, బస్తీలు, అంతర్గత రహదారులు కొనుగోళ్లతో సందడిగా మారుతున్నాయి.. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే షాపింగ్ చేసేందుకు అవకాశం ఉండటంతో ఒక్కసారిగా అందరూ కొనుగోళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. ఆదివారం అయితే చేపల మార్కెట్లతో పాటు చికెన్, మటన్షాపులు కిక్కిరిసిపోతున్నాయి. కొనుగోలు సమయంలో కొందరికి కొవిడ్ నిబంధనలు పాటించాలన్న ధ్యాస కూడా ఉండటంలేదు. ఇది చాలా ఆందోళనకర పరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది. నాన్వెజ్ ఆదివారం కాకుండా ఇతర రోజుల్లోనూ దొరికే అవకాశం ఉన్నా, కేవలం ఆదివారం మాత్రమే వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతూ కరోనా వ్యాప్తికి ఆజ్యంపోస్తున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా నగర వాసుల్లో మార్పు వచ్చి.. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.