న్యూఢిల్లీ : కొవిడ్-19తో పోరాడలేని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసిన వారిపై విరుచుకుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కొవిడ్ మరణాలను సరైన రీతిలో వెల్లడించకుండా బీజేపీ అసత్యాలు చెబుతోందని అన్నారు. మధ్యప్రదేశ్ లో కొవిడ్-19తో లక్షకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. తాను జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మార్చి, ఏప్రిల్ మాసాల్లో మధ్యప్రదేశ్లో స్మశానాలకు 1,27,.000 మృతదేహాలు వచ్చాయని వీటిలో 80 శాతం కొవిడ్-19 మృతులవేనని కమల్ నాథ్ పేర్కొన్నారు.
మరోవైపు కరోనా భారత్ వేరియంట్ తో ప్రధాని, రాష్ట్రపతిలో గుబులు రేగిందని, భారత్ స్ట్రెయిన్ తోనే దేశ్ంలో సెకండ్ వేవ్ విరుచుకుపడిందని కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నేతలు తోసిపుచ్చారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచేలా ఉండటంతో పాటు మహమ్మారిపై పోరాటాన్ని నీరుగార్చేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు.