ఈ నెల 31 వరకు ఎర్లీబర్డ్ గడువు పొడిగింపు
ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీ
సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారుల సూచన
కాగజ్నగర్టౌన్ , మే 10 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మున్సిపల్శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ పథకం గడువు ఏప్రిల్ 30 వరకే ఉండగా, దానిని ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ పథకం కింద కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలో ఏప్రిల్లో రూ. 8 లక్షల వరకు ఆస్తి పన్ను వసూలు కాగా, గడువు పొడిగింపుతో మరిన్నీ ట్యాక్స్లు వసూలయ్యే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
వార్షిక పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 1.55 కోట్లు
కాగజ్నగర్ మున్సిపల్ సర్కిల్లో రూ. 1.55 కోట్ల ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా ఉండగా, మార్చి చివరి నాటికి రూ.1.46 కోట్లు (94.12శాతం) వసూలయ్యాయి. గతేడాది 89 శాతం వసూలు చేయగా, ఈయేడు 5.12శాతం అధికంగానే వసూలైంది. ఇంకా ఈ నెలాఖరు వరకు సమయం ఉండడం తో పెద్ద మొత్తంలో పన్ను వసూళ్లు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎర్లీ బర్డ్ కింద ముందుగానే ఆస్తి పన్ను చెల్లిస్తున్నవారు 5 శాతం తగ్గించుకొని మిగితా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఈ పథకాన్ని వినియోగించుకోలేదని, ఇప్పటికైనా ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి ..
ఎర్లీబర్డ్ పథకం గడువును ప్రభుత్వం ఈ నెలాఖరువరకు పొడిగించింది. ఇంకా 20 రోజుల సమయం ఉన్నది. గడువు లోగా ముందస్తు ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ లభిస్తుంది. పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా ఐదు బృందాలు ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో కూడా పన్నులు చెల్లించవచ్చు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.