మనం లాంటి క్లాసికల్ ఫ్యామిలీ సినిమా ప్రేక్షకులకు అందించిన తర్వాత అక్కినేని కుటుంబ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పైగా కథ నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు ఈ హీరో. తన పాత్ర నచ్చిందంటే ఎందులోనైనా నటిస్తాడు. ఇదిలాఉంటే ఇప్పుడు తన ఇద్దరు కొడుకులతో కలిసి ఓ సినిమాలో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నాడు నాగార్జున. ఇప్పటికే పెద్ద కొడుకు నాగచైతన్యతో కలిసి మనం సినిమాలో నటించాడు ఈయన. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన దృశ్య కావ్యంగా మిగిలిపోయింది.
విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన మనం సినిమాలో అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించింది. లెజండ్రీ నటుడు నాగేశ్వరరావు చివరి సినిమా ఇది. అలాగే చివర్లో అఖిల్ అక్కినేని కూడా చిన్న పాత్ర చేశాడు. దానికి తోడు అమల అక్కినేని కూడా నటించింది. మనం లాంటి సినిమా చేసుంటే బాగున్ను అని చాలా మంది హీరోలు కలలు కన్నారు. అప్పుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున.. ఇప్పుడు అఖిల్ తో కలిసి నటించబోతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించబోతుండటం. అవును.. బంగార్రాజు సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఇందులో నాగార్జున, అఖిల్ తండ్రీ కొడుకులుగా కాదు తాత మనవళ్లుగా నటించబోతున్నారని తెలుస్తుంది. బంగార్రాజు కొడుకుగా నాగ చైతన్య నటిస్తుంటే.. మనవడిగా అఖిల్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు చెబుతానని మీడియా ముందు ప్రకటించాడు నాగార్జున. మరోవైపు అఖిల్ తో మరో మల్టీస్టారర్ కూడా చేయబోతున్నాడు ఈయన. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి వివరాలు ఇంకా చెప్పలేదు కానీ కథ సిద్ధమవుతుందని మాత్రం క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. దీని తర్వాత నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ ఉండబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.