సర్కారు దవాఖానల్లో సేవలు
లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లు
కిట్లో పది రకాల మందులు
కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
ఇంట్లో ఉండడానికి వీలులేకుంటే కొవిడ్ కేంద్రాలకు..
దండేపల్లి, మే 9 : కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ అవుట్ పేషంట్ (ఓపీ) సేవలను ప్రారంభించింది. పీహెచ్సీలో రెగ్యులర్ వైద్య సేవలతో పాటు అదనంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పీహెచ్సీల్లో ఉదయం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో పరీక్షలు చేయడంతో అందరికీ చేయడం సాధ్యం కావడం లేదు. పాజిటివ్తో పాటు లక్షణాలున్న వారిని కొవిడ్ అనుమానితులుగా భావించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యాధికారి స్ఫురణ తెలిపారు. పీహెచ్సీకి వైద్యారోగ్యశాఖ మెడికల్ కిట్లను అందించింది. ప్రతిరోజూ లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లను అందిస్తున్నారు. కిట్లోని మందులను 14 రోజులు తప్పనిసరిగా వాడాలని, ఇందులో కొన్ని 5 రోజుల వరకు వచ్చేవి ఉండగా, మిగిలినవి 14 రోజుల వరకు వాడాలని వైద్యాధికారి తెలిపారు. కిట్లో దాదాపు పది రకాల మందులున్నాయి.
కౌన్సెలింగ్కు ప్రాధాన్యం..
పాజిటివ్ అనగానే హైరానా పడేవారు, తీవ్ర ఆందోళన చెందే వారి సంఖ్య ఎక్కువ ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకే వారికి కొవిడ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. మెడికల్ కిట్ ఎలా వాడాలి? మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఐదు రోజుల పాటు వాడినా తగ్గకపోతే ఏం చేయాలి? ఇంట్లో ఎలా ఉండాలి? తదితర విషయాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విడిగా ఉండేందుకు రూమ్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాలకు పంపుతూ అవగాహన కల్పిస్తున్నారు. లక్షణాలున్న వారు కొవిడ్ టెస్టు ఫలితం వచ్చే వరకు ఆగకుండా మందుల కిట్ ఇచ్చి చికిత్స ప్రారంభిస్తే, స్వల్ప లక్షణాలు ఉన్నవారు కోలుకుంటారని వైద్యురాలు స్ఫురణ తెలిపారు.