న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఢిల్లీ ఆసుపత్రులలో కరోనా పరిస్థితులు, బెడ్లు, ఆక్సిజన్ కొరతకు సంబంధించి పలు ఆసుపత్రులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లితో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. కొన్ని పెద్ద ఆసుపత్రులు ఖర్చుల పేరుతో ఎంతో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించింది. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని వీటిని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
బెడ్ల కొరత నేపథ్యంలో రోగులను బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆసుపత్రులలో చోటుచేసుకున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్లపైనా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఎంత మంది రోగులు అడ్మిట్ అయ్యారు, ఎంత మందిని డిశ్చార్జ్ చేశారు, ఇంకా ఎంత మంది చికిత్స పొందుతున్నారు అన్న వివరాలను సమర్పించాలని ఢిల్లీ ఆసుపత్రులను కోర్టు ఆదేశించింది.