కొల్లాపూర్, ఏప్రిల్ 27: నల్లమల అడవిలో వర్షాధారం నీటితో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుకు మంచిరోజులు రాబోతున్నాయి. ఈ చెరువు ఓసారి అలుగుపారితే రెండు పంటలు పుష్కలంగా పండుతాయి. ఈ చెరువు ఆయకట్టు రెండువేల పైచిలుకు ఎకరాలు ఉంటుంది. ఈ చెరువు కింద మొలచింతపల్లి, ముక్కిడిగుండం, గేమ్యాతండా గిరిజనుల భూములు సాగులోకి వినియోగంలోకి వస్తాయి. ఈ చెరువుకు కృష్ణానది నీటితో నింపి రైతాంగానికి సాగునీరు ఇచ్చి తీరాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఇప్పటికే మండువేసవిలో రెండుసార్లు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి చెరువును సందర్శించిన విషయం విధితమే. తీరా మంగళవారం నీటిపారుదలశాఖ సర్వేఅధికారులు నారాయణరెడ్డి, అశోక్రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సర్వే నిర్వహించారు. మొదట వీరు మొలచింతపల్లి సమీపంలో ఉన్న పెద్ద చెరువును పరిశీలించారు.
ఈ పెద్ద చెరువును మొదట నింపి తద్వారా జీల్దార్ తిప్ప చెరువును నదీనీటితో నింపాలన్న యోచనలో ఇంజినీరింగ్ అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు గ్రావిటీ కెనాల్, లేదా లిఫ్ట్ నుంచి నీటిని తీసుకురావడానికి సర్వే చేశారు. అయితే ప్రతి ఎకరా, ప్రతి గుంటకు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలుచేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే బీరం ఉన్నారు. దీంతో రాబోయే అతి కొద్దిరోజుల్లో జీల్దార్తిప్ప ప్రాజెక్టును కృష్ణానది నీటితో నింపనున్నడంతో నల్లమల రైతాంగానికి శాశ్వత సాగునీటి సమస్య తీరనున్నది. కార్యక్రమంలో మాచినేనిపల్లి సింగిల్విండో చైర్మన్చింతకుంట శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామచందర్యాదవ్, ముక్కిడిగుండం సర్పంచ్ దశరథ్నాయక్, మొలచింతపల్లి గ్రామ రైతులు బాల్నాగన్న, నరేశ్గౌడ్, శంకర్, బాలయ్య, శేషయ్య తదితరులున్నారు.