జాగ్రత్తలు తీసుకోవాలి:వైద్య నిపుణులు
హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): రెండో దశ కొవిడ్ విజృంభనలో సరికొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటి దశలో కేవలం జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు తదితర సాధారణ లక్షణాలు ఉండగా, ఈ సారి విరేచనాలు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, కంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 1-3 శాతం కొవిడ్ బాధితుల్లో కంటి సమస్యలు ఎదురవుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కంటిలోని తెలుపు రంగు గుడ్డును వైరస్ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల రంగు మారుతుందని, దీన్ని పింక్ ఐ అని అంటారని వైద్యులు చెబుతున్నారు. కండ్లు ఉబ్బడం, ఎర్రగా మారడం, దురదగా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కేవలం ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కరోనా సోకినట్టుగా భావించకూడదని, ప్రామాణికంగా తీసుకునే లక్షణాలైన జ్వరం, దగ్గు, జులుబు, ఒంటి నొప్పులకు తోడు కంటి సమస్యలు ఉంటే అనుమానించాలని సూచిస్తున్నారు. ఇతర వైరస్, బ్యాక్టీరియా, రసాయనాలు, ఇతర అలర్జీల వల్ల కూడా ఇలా అయ్యే అవకాశం ఉందంటున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, కండ్లద్దాలు ధరించడం, దురద పెట్టినప్పటికీ కండ్లను రుద్దకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
కండ్లు ముట్టుకోవద్దు
పింక్ ఐ అనేది కరోనా సోకిన వారిలో కొత్త లక్షణం. దీన్ని కొందరిలో చూస్తున్నాం. ఇది సాధారణమైంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడు, నాలుగు రోజుల్లో దానికదే తగ్గిపోతుంది. మనవంతుగా శుభ్రత పాటించాలి. చేతులను కండ్లను తాకకుండా చూసుకోవాలి. మాస్క్ ధరించాలి. మంచి ఆహారం తీసుకోవడం, కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ‘పింక్ ఐ’తోపాటు జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటేనే కొవిడ్గా పరిగణించాలి. అప్రమత్తమై నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.