సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23: దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పైనే ప్రేమ కురిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో అత్యవసర సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడికక్కడే కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా సిద్దిపేట ప్రభు త్వ వైద్య కళాశాల డైరెక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు, కొవిడ్ వార్డు ఇంచార్జీలతో సమీక్షించా రు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గుజరాత్కు లక్షా 63 వేల వ్యాక్సిన్లు పంపించగా, తెలంగాణకు కేవలం 21 వేల వ్యాక్సిన్లనే పంపించిందంటూ కేంద్రం తీరును తప్పుబట్టారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఈ దేశంలో లేదా? ఇక్కడి ప్రజలవి ప్రాణాలు కావా? అని మండిపడ్డారు. వ్యాక్సిన్ల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిందన్నారు.
కేంద్రం కొనుగోలు చేస్తే రూ.150, రాష్ర్టాలు కొనుగోలు చేస్తే రూ.400 ధర నిర్ణయించడం దారుణమన్నారు. హైదరాబాద్లో తయారయ్యే వ్యాక్సిన్పై కేంద్రం పెత్తనం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ అంతటికీ వ్యాక్సిన్ సరఫరా చేశాకే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. దీనిపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే కరోనా పేషెంట్లను తిరస్కరించవద్దని, వారిని అడ్మిట్ చేసుకోవాలని మంత్రి వైద్యులకు సూచించారు. సిద్దిపేట జిల్లాకు మరిన్ని టీకాలు అవసరముందని డీఎంహెచ్వో చెప్పడంతో మంత్రి వెంటనే స్పందించారు. రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ సెక్రటరీ వాకాటి కరుణకు ఫోన్ చేసి 30 వేల వ్యాక్సిన్లు కావాలని కోరగా, ఆమె వెంటనే అంగీకరించారు.