ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వాంఖడే మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పోరాడే స్కోరు చేసింది. శివమ్ దూబే(46: 32 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), రాహుల్ తెవాటియా(40: 23 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. 43/4తో కష్టాల్లో ఉన్న జట్టును ఈ ఇద్దరే ఆదుకున్నారు.
స్వల్ప స్కోరుకే టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ పెవిలియన్ చేరినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ గౌరవప్రదమైన స్కోరు అందించారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా..జేమీసన్; రిచర్డ్సన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఆరంభంలోనే బెంగళూరు బౌలర్ల దెబ్బకు జోస్ బట్లర్(8), మనన్ వోహ్రా(7), డేవిడ్ మిల్లర్(0), సంజూ శాంసన్(21) పెవిలియన్ బాట పట్టారు.
రియాన్ పరాగ్(25: 16 బంతుల్లో 4ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆరంభంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించిన బెంగళూరు బౌలర్లు మధ్య ఓవర్లలో తేలిపోయారు. దూబే, తెవాటియా పోటీపడి బౌండరీలు బాదడంతో ఆ జట్టు ఊహించని స్కోరు సాధించింది.