న్యూఢిల్లీ : వాతావరణ సంక్షోభంపై గురువారం జరిగే ప్రపంచ దేశాధినేతల వర్చువల్ సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారని విదేశాంగ తెలిపింది. అమెరికా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సమ్మిట్ జరుగనుంది. భారత కాలమాన ప్రకారం సమావేశం సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు కొనసాగనుంది. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 40 దేశాలకు చెందిన ప్రభుత్వాదినేతలు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని విదేశాంగ పేర్కొంది.
యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులపై దేశాధినేతలు చర్చించనున్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. తిరిగి పారిస్ ఒప్పందంలో అడుగుపెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.