రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయం
బార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..
సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు
మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణంలో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని సినీ పంపిణీ, ప్రదర్శనదారులు స్వచ్ఛందంగా నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండటంతో నిర్వహణ వ్యయాలు రా బట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్లే థియేటర్లను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. స్వచ్ఛంద మూసివేత నుంచి ‘వకీల్సాబ్’ సినిమాను ప్రదర్శించే థియేటర్లను మినహాయిస్తున్నట్టు ప్రదర్శనదారులు ప్రకటించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అంతకుముందు కర్ఫ్యూ నేపథ్యంలో సినిమా థియేటర్లు రాత్రి 8 గంటలకే మూ సివేయాలని సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలు అమలుచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు, థియేటర్లలో పనిచేసే సిబ్బంది, వెండర్లు విధిగా అన్ని సమయాల్లో మాస్క్లు ధరించాలని సూచించారు.