వ్యవసాయ యూనివర్సిటీ : ఆహార ఉత్పత్తుల్లో మంచి ఫలితాలు సాధించామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచ దేశాల చూపు మనవైపే ఉన్నాయన్నారు. దేశ ఆర్థిక ఉత్పాదకత సామర్థ్యం, రైతుల ఆదాయాన్ని పెంచడం ఉద్యాన రంగానికే సాధ్యమని చెప్పారు. బుధవారం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభను ఉద్దేశించి గవర్నర్ ఆన్లైన్లో ప్రసంగించారు.
కొవిడ్ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాలు దెబ్బతిన్నప్పటికీ సాగు రంగంలో 3.4 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల శాస్త్రవేత్తలు రైతులకు ఇచ్చిన భరోసాతోనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరుగడంతో ఎగుమతులు రెట్టింపై ఆర్థిక వనరులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. దేశంలో మాల్న్యూట్రిషియన్ తగ్గించేందుకు పోషకాలున్న మరిన్ని దేశీయ సాంప్రదాయ కూరగాయలు, పండ్లలో నూతన రకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఆయిల్పామ్ , ఆలు , ఉల్లి, సాగు విస్తీర్ణానికి అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలో 80 శాతం ప్రజలు పోషకాహారం తీసుకోవడం లేదని, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం రోజుకు కూరగాయలు , పండ్లు కలిపి తీసుకోవాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డా.త్రిలోచన్ మహపాత్ర అన్నారు. యూనివర్సిటీ ఉపకులపతి డా.నీరజాప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అనంతరం 2016 నుంచి 2019 సంవత్సరాల్లో ఎక్కువ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.