తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని జయవిజయుల వద్ద అదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఉదయం 7 గంటలకు మల్లాది విష్ణుతో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.
శ్రీవారి ఆలయం వెలుపల విష్ణు మీడియాతో మాట్లాడుతూ
టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించినందుకుగాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.