తెలంగాణ.. చారిత్రక వైభవానికి, వారసత్వ కట్టడాలకే కాదుఅపారమైన విజ్ఞాన సంపదను పంచిన విద్యాలయాలకూ నిలయం. వెయ్యేండ్ల క్రితమే సరస్వతీ నిలయంగా విలసిల్లిందీ ప్రాంతం. అక్కడక్కడా వెలుగు చూస్తున్న పుస్తకగచ్ఛ శిల్పాలే ఇందుకు నిదర్శనం. నాగార్జున కొండ విశ్వవిద్యాలయం భారతదేశంలోని, అలనాటి మేటి విద్యాలయాల్లో ఒకటి. ఇక్కడి బడులు విద్యతోపాటు వినయాన్నీ నేర్పించాయి. భాషా పరిజ్ఞానాన్ని, నీతి న్యాయాలనూ ప్రబోధించాయి. నాటి శాసనాలు, శిల్పాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. బౌద్ధారామాల్లో, జైన బసదుల్లో, శైవ మఠాల్లో విద్యాబోధనలు, వైద్యసేవలు అందించేవారని తెలిపే శాసనాలెన్నో ఉన్నాయి. బౌద్ధ, జైనమతాలు క్రీస్తుశకం 6వ శతాబ్దం నుండి వైదిక విద్యావిధానానికి భిన్నంగా.. సార్వజనిక విద్యాలయాలను ప్రారంభించాయి. అన్ని వర్గాల విద్యార్థులకూ ప్రవేశం కల్పించాయి. తెలంగాణలోని కొలనుపాక, బోధన్, కూరెళ్ల, హన్మకొండ, ఓరుగల్లులలో జైన విద్యాకేంద్రాలు ఉండేవి.
స్థానిక భాషలో..
జైన విద్యాకేంద్రాల్లో స్థానిక భాషలోనే విద్యాబోధన చేశారు. మత సంబంధ విషయాలతోపాటు అష్టాంగ మార్గం, ఆయుర్వేదం, జ్యోతిషం, గణితం, వ్యాకరణం, రాజనీతి, సాహిత్యం బోధనలో భాగంగా ఉండేవి. తెలంగాణలోని కృష్ణా తీరాన విజయపురి (నేటి నాగార్జునసాగర్), ఫణిగిరి ప్రాంతాల్లో ఆరామాల పేరుతో బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవని చరిత్ర చెబుతున్నది. ‘సృహుల్లేఖ’ గ్రంథాన్ని నాగార్జునకొండ మీద విద్యార్థులు వల్లె వేసేవారని విదేశీ యాత్రికుడు ఇత్సింగ్ రాశారు.
పుస్తకగచ్ఛ శిల్పాలు..
అంతకు ముందే, కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం ఒక విద్యా కేంద్రానికి నెలవైందనేది చరిత్రకెక్కని విషయం. హన్మకొండలోని పద్మాక్షి దేవాలయ ప్రాంతంలో ‘కడలాయ బసది’ పేరుతో వసతి కేంద్రం ఉండేది. తొమ్మిదో శతాబ్దంలో స్థానిక పాలకులకు మంత్రిగా పనిచేసిన బేతన భార్య మైలమ ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆ వివరాలను పేర్కొంటూ నల్లరాతిమీద నాలుగువైపులా సంస్కృత, కన్నడ భాషల్లో, హళేగన్నడ లిపిలో చెక్కిన ఓ శాసనాన్ని క్రీ.శ 1117లో వేయించారు. అక్కడే పుస్తక గచ్ఛ లేదా సరస్వతి గచ్ఛ అనే జైన విద్యాకేంద్రం ఉండేది. అక్కడి రాతిగోడపై జైన గురువు, ఆయన ఎదుట ఇద్దరు విద్యార్థులు, వారి మధ్య వ్యాసపీఠం (పఠన సమయంలో పుస్తకాన్ని ఉంచే చెక్క వస్తువు) శిల్పాలు కనిపిన్నాయి. పద్మాక్షిగుట్టపై ఇలాంటి శిల్పాలు రెండున్నాయి. ఈ పుస్తకగచ్ఛ శిల్పాలు విద్యాలయాలకు, విద్యాబోధనకు చిహ్నాలు. జైన బసదుల్లో ఉచితంగా వైద్యం, విద్య అందించేవారని శాసనాలు, జైన సాహిత్యం వల్ల తెలుస్తున్నది. ఇప్పుడీ శిల్పం మూలంగా ఈ ప్రదేశం కూడా జైన విద్యాకేంద్రంగా వర్ధిల్లిందని నిర్ధారించవచ్చు. ఆలయం లోపల 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలతో ‘చౌవిస’ శిల్పం ఉన్నది. 24 తీర్థంకరులున్న ‘చౌవిస’ స్తంభాలు, పుస్తక గచ్ఛ శిల్పాలున్నచోట జైన విద్యాకేంద్రాలు తప్పకుండా ఉంటాయని చరిత్రకారులు ధ్రువీకరించారు. పక్కనే ఉన్న మరో గుట్ట జైన మతగురువు, ప్రాచీన ఆయుర్వేద వైద్యుడైన అగ్గలయ్య పేరుతో స్థిరపడింది. సుదూర ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వచ్చి, విద్యనభ్యసించేవారు.
బోధనా కేంద్రాలుగా..
సుప్రసిద్ధ జైన దేవాలయమైన కొలనుపాక శ్వేతాంబరాలయం సమీపంలోని జైన శిల్ప సంగ్రహాలయంలో జైన చౌముఖి స్తంభాలు, జైన స్థూప ప్రతిమ, జైన యక్షిణులు, జైన గురువులు, జైన తీర్థంకరులు, శాసనాలు, బాహుబలి విగ్రహాలున్నాయి. సంగ్రహాలయం ప్రాంగణంలోని రాతి స్తంభం మీద జైన మహావీరుడు, అతని కింద వ్యాస పీఠం, పీఠానికి ఎదురుగా ఒక జైన ఉపాధ్యాయుడు వ్యాఖ్యాన ముద్రతో కూర్చుని ఉన్న శిల్పం.. దర్శనమిస్తాయి. ఈ స్తంభ శిల్పం పుస్తకగచ్ఛ/సరస్వతిగచ్ఛకు సంబంధించింది. సిద్దిపేట జిల్లాలోని కూరెళ్ల గ్రామంలోనూ జైనమతం పరిఢవిల్లింది. కూరెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు ఉన్న నీలిరంగు రాతితో చెక్కిన జైన చౌముఖి శిల్ప స్తంభం ఉన్నది. అందువల్ల, ఈ గ్రామం ఒకప్పటి జైనమత కేంద్రమే కాదు, జైన విద్యా కేంద్రమని కూడా చెప్పవచ్చు.