న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీజేఐగా ఎవరిని నియమించాలో పేరు సిఫారసు చేయవలసిందిగా జస్టిస్ బోబ్డేను కేంద్రప్రభుత్వం శనివారం కోరింది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత అనుభవం ఉన్న (సీనియర్ మోస్ట్) వ్యక్తిని సీజేఐగా నియమిస్తారు. ఇందుకోసం ప్రస్తుత సీజేఐ కేంద్రానికి పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో బోబ్డే తరువాత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు.