హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం దేవాదాయశాఖకు పెద్దపీట వేసింది. ఎన్నడూలేని విధంగా ఈసారి రూ.720 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం జిల్లాల్లో అమలవుతున్న ధూప దీప నైవేద్య పథకాన్ని ఇకపై జంటనగరాల్లోని ఆలయాలలో కూడా అమలుచేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా 7,500 దేవాలయాలకు ప్రయోజనం కలుగనుంది. ఉమ్మడి రాష్ట్రంలో తాజాగా కేటాయించిన రూ.720 కోట్లలో సామాజిక సేవా కార్యక్రమాలు, బోనాల పండుగ, సహాయక గ్రాంట్లు తదితరమైన వాటికి రూ. 15కోట్లు, కామన్ గుడ్ ఫండ్ కింద రూ. 23.75కోట్లు కేటాయించారు. అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల వేతనాల నిధికి రూ. 120 కోట్లు కేటాయించారు. అలాగే, రాష్ట్ర పథకాలు, ఇతర సహాయక గ్రాంట్లకు రూ. 200కోట్లు కేటాయించారు. జిల్లాల్లోని 3,800 దేవాలయాలకు 2015నుంచి ధూప దీప నైవేద్యాల కింద నెలకు రూ. 6500 చొప్పున మంజూరు చేస్తుండగా, వచ్చే అర్థిక సంవత్సరం నుంచి జంట నగరాల్లోని దేవాలయలకు కూడా ఇది వర్తిస్తుంది