చొప్పదండి, మార్చి 16: పల్లె అనే పదానికి సరికొత్త నిర్వచనమిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ స్వచ్ఛతకు చిరునామాగా నిలుస్తున్నది మండలంలోని దేశాయ్పేట గ్రామం. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతిలోని పది ప్రమాణాలను పక్కాగా అమలుచేస్తూ అభివృద్ధిలో ముందున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన వైకుంఠధామం, కంపోస్ట్షెడ్డు, ప్రకృతివనం పనులను సకాలంలో పూర్తి చేసుకుని మండలానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్న దేశాయ్పేట గ్రామంపై ప్రత్యేక కథనం..
స్వచ్ఛతకే మొదటి ప్రాధాన్యం
పరిశుభ్రత విషయంలో సర్పంచ్తోపాటు పాలకవర్గసభ్యులు, పంచాయతీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వచ్ఛతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో నిరంతరం పంచాయతీ సిబ్బంది చెత్తాచెదారాన్ని సేకరిస్తూ డంప్యార్డుకు తరలిస్తున్నారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం, తాగునీటి సరఫరాలో భాగంగా మిషన్భగీరథ ట్యాంకులను క్లోరినేషన్ చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు పనులు నిరంతరం చేపట్టడంతో స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్నది. అంతేకాకుండా గ్రామంలో 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టడంతో గతంలోనే గ్రామం నిర్మల్పురస్కార్ అవార్డును సాధించింది.
వేగంగా నిర్మాణ పనులు
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం, కంపోస్ట్షెడ్డు, ప్రకృతివనం పనులను వేగంగా పూర్తి చేశారు. వీటిని పాలకవర్గం, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైకుంఠధామంలో దహన సంస్కరాలకు రెండు బర్నింగ్ ప్లాట్ఫాంలతో పాటు, దహనసంస్కారాలకు వచ్చే మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రెస్సింగ్ రూంలతో పాటు మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. నీటికోసం బోర్ కూడా వేశారు. వైకుంఠధామం సమీపంలోనే కంపోస్ట్ షెడ్డు నిర్మించి గ్రామంలో సేకరించిన చెత్తాచెదారంలో ఏ విభాగానికి సంబంధించిన వస్తువులను ఆయా విభాగాల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. దీని ద్వారా పంచాయతీకి అదనపు ఆదాయం కూడా వస్తున్నది. పల్లెప్రగతి పనులతో పాటు గ్రామపంచాయతీ ప్రహరీ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. పల్లెప్రగతిలో గ్రామంలో 50 కరెంట్ స్తంభాలు అవసరముండగా, విద్యుత్ అధికారులు ఏడు స్తంభాలు మాత్రమే ఇచ్చారు. విద్యుత్ అధికారులను ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదని పంచాయతీ పాలకవర్గ సభ్యులు చెబుతున్నారు.
హరితహారంపై ప్రత్యేక దృష్టి
హరితహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత విడుతల్లో నాటిన మొక్కల చుట్టూ ట్రీగార్డులు అమర్చి, వారానికి మూడుసార్లు గ్రామపంచాయతీ వాటర్ట్యాంకర్తో నీళ్లు పడుతున్నారు. దీంతో రోడ్డుకిరువైపులా మొక్కలు పెరగంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది హరితహారానికి గ్రామంలోని నర్సరీలో 10వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి
పాలకవర్గం, గ్రామస్తులు, అధికారుల సమష్టి కృషితోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లెప్రగతి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నాం. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సహకారంతో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కృషి చేస్తాం. గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తి స్థాయిలో వేసేందుకు విద్యుత్ అధికారులు సహకరించాలి.