ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ వెబ్సైట్లలో ఉద్యోగ ప్రకటనలు పెట్టి.. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.. అపాయింట్మెంట్ లెటర్లు సిద్ధం అవుతున్నాయి.. మంచి ఉద్యోగం అంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు… నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుందనే ఆశతో వారు అడిగినంత ఇచ్చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసపోయిన బాధితులు నిందితులను పట్టుకోవడానికి కోయంబత్తూరుకు వెళ్లగా.. అక్కడ తనకు కరోనా ఉంది అని నిందితుడు తప్పించుకున్నాడు.. దీంతో అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు శుక్రవారం నగర సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం…
ముషీరాబాద్కు చెందిన ఓ యువకుడు షైన్.కామ్లో తన రెజ్యుమ్ను అప్లోడ్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. మీ రెజ్యుమ్ను చూశాం.. మీకు దుబాయ్లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించారు. అందుకు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలంటూ మొదలు పెట్టి.. వివిధ కారణాలు చూపుతూ రూ. 4.4 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసం జరుగుతుందని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
నగరానికి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో ఉద్యోగాలిప్పిస్తామనే ప్రకటనను చూసి.. అందులోని నంబర్ను సంప్రదించాడు. అవతలి నుంచి దుబాయ్లో మంచి ఉద్యోగాలున్నాయని, రూ. 1.2 లక్షలు చెల్లిస్తే వీసాతో పంపిస్తామంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ముందుగా రూ. 60 వేలు చెల్లించాడు. ఆ తరువాత వారు చెబుతున్న మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు.. వారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారనే విషయం తెలుసుకోగా.. కోయంబత్తూరు అతని తేలింది. వెంటనే అతడితోపాటు మరికొంత మంది బాధితులు అక్కడికి వెళ్లారు… రెండు రోజుల్లో మీకు అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని సిద్ధం చేసి పెడుతామం టూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. రెండు రోజులకు కూడా సమాధానం లేకపోవడంతో బాధితులు కోయంబత్తూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పోలీస్స్టేషన్కు రావాలంటూ నిందితుడికి సూచించగా… తనకు కరోనా వచ్చిందంటూ తప్పించుకున్నాడు. వెంటనే నిందితుడు చెప్పిన చిరునామాలో వాకబ్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో అక్కడి పోలీసులు.. మీరు హైదరాబాద్లోనే ఫిర్యాదు చేసుకోండని సూచించగా.. బాధితులు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.