ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మూడు రోజుల్లో 2లక్షల మందికిపైగా దర్శనం
ఒక్కరోజే 63.32 లక్షల ఆదాయం
వేములవాడ టౌన్, మార్చి12 :‘రాజన్నా మళ్లస్తం’ ‘మా పిల్లా జెల్లను సల్లంగా చూడు’ అంటూ వేములవాడ రాజన్నను భక్తులు వేడుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగియడంతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. మూడు రోజుల్లో మొత్తం 2.50 లక్షలకుపైగా మంది స్వామివారిని దర్శించుకోగా, ఒక్కరోజే 633.32లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు వేములవాడలో వైభవంగా జరిగాయి. బుధవారం మొదలైన ఈ వేడుకలు, శుక్రవారంతో ముగిశాయి. మొదటి రోజు 50వేల మంది, రెండో రోజు దాదాపు లక్షా 50వేల మంది స్వామివారిని దర్శించుకోగా, మూడో రోజు కూడా వేలాది మంది దర్శించుకున్నారు. సన్నిధిలో రాత్రి జాగారం చేసి, ఉదయాన్నే పుణ్యస్నానాలు చేశారు. కోడె, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ‘మా పిల్లా జెల్లను సల్లంగ సూడు రాజన్న’ అంటూ ఆలయ ముఖద్వారం ఎదుట మొక్కుకుని తిరుగుపయనమయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రారంభమైన శివార్చన వేడుకలను (సాంస్కృతిక కార్యక్రమాలు) శుక్రవారం ఉదయం ఆరుగంటల దాకా నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నేతృత్వంలో వెయ్యి మంది కళాకారులు రెండ్రోజులపాటు 20కిపైగా కళా ప్రదర్శనలతో ఆలరింపజేశారు.
రెండు రోజుల్లో 85.55 లక్షల ఆదాయం..
జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి బుధ, గురువారాల్లో 85,55,504 ఆదాయం సమకూరింది. శివరాత్రి ముందు రోజు బుధవారం 22,23,159 రాగా, శివరాత్రి రోజు 63 లక్షలా 32 వేల 345 ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో.. కోడె మొక్కుల ద్వారా 33.86లక్షలు, ఆర్జిత సేవల ద్వారా 27.952, ప్రసాదాల ద్వారా 38,86,680, కేశఖండన టికెట్ల ద్వారా 1,42,400, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా 4.64లక్షలు, అతిశీఘ్రదర్శనం టికెట్ల ద్వారా 4,55,100, బద్దిపోచమ్మ ఆలయంలో టికెట్ల ద్వారా 97,425, భీమేశ్వరాలయంలో టికెట్ల ద్వారా 20,680, నగరేశ్వర ఆలయంలో టికెట్ల ద్వారా 15,450, వసతి గదుల అద్దెల ద్వారా 39,600, ఇతరత్రా 20,237 వచ్చినట్లు రాజన్న ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ వెల్లడించారు.