భారీ కమీషన్లు, అధిక వడ్డీ ఆశతో కొంతమంది మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీముల్లో చేరుతున్నా రు.. ప్రాథమికంగా చేరినవారు కొంత లాభం ఆర్జిస్తున్నా… ఆ తర్వాత చేరినవారు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్లపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ నజర్ పెట్టారు.. ఇక సామాన్యుడు మోసపోకుండా ఉండేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2018, జూలైలో ‘సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగాన్ని’ ప్రారంభించారు. అప్పటి నుంచి సామాన్యుల్లో ఆశలు పుట్టించి.. వారిని నిండా ముంచే స్కీమ్ల భరతం పడుతున్నారు. ఇలా.. రెండున్నర యేండ్లలో మొత్తం 13 మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ల బాగోతాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా కొన్ని మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు దాదాపు రూ.10 వేల కోట్లు వసూలు చేయగా.. సామాన్యులు మాత్రం కట్టిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న దాదాపు 13 కంపెనీల మోసపూరిత కోణాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 180 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కంపెనీలు, నిందితుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన దాదాపు రూ.623 కోట్లను జప్తు చేశారు. వారి నుంచి రూ.7.44 కోట్లను రికవరీ చేశా రు. ప్రజలను మోసం చేస్తున్న మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రతినిధులపై పీడీ యాక్ట్ను విధించి.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యూలేషన్(బ్యానింగ్) యాక్ట్ కింద ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ల్లో చేరిన వారందరినీ నేరస్తులుగానే పరిగణిస్తారని చట్టం స్పష్టంగా పేర్కొంది. ఈ కారణంగా మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ లు నిర్వహించే ప్రతినిధులు, కంపెనీల ఖాతాల్లో జప్తు చేసిన నగదును కోర్టుకు అందిస్తారు తప్పా.. అందులో చేరి మోసపోయిన వారికి తిరిగి ఇవ్వరు. కోర్టు నిర్ణయం మేరకు ఈ నగదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో ప్రజలకు అధిక వడ్డీ ఇస్తామని, మీ పెట్టుబడికి వడ్డీతో పాటు ఇతరులను చేరిపిస్తే భారీ కమీషన్లు ఇస్తామని, ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులను మా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసి ఇతరులను సభ్యులుగా చేర్పిస్తే భారీగా కమీషన్లు ఉంటాయని.. ఇలా ఆశ పుట్టించి మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు మోసం చేస్తున్నాయి. మొదట లాభాలు వస్తున్నట్లు నమ్మించి… ఆ తర్వాత వారి ద్వా రా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను సభ్యులుగా చేర్పించేలా చేస్తారు.. వారు లాభాల కోసం ఎదురుచూస్తూ.. చివరికి మోసపోయామని గుర్తించేసరికే ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. ఇలా అమాయకులను మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీముల్లో చేర్పించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
కరక్కాయ స్కీమ్, ఎఫ్ఎంఎల్సీ(ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్), ప్రొ హెల్తీ వేజ్, సన్పరివార్, ఈ-బిజ్, క్యూనెట్, మా సంతోషి చిట్ ఫండ్స్, సెర్ఫా మార్కెటింగ్, స్వధాత్రి, భవ్య కన్స్ట్రక్షన్స్, బైక్బూట్, షేర్ బైక్, ఇండస్ వివా కంపెనీల మోసాన్ని బయటపెట్టిన సైబరాబాద్ పోలీసులు.. మొత్తం 180 మందిని అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ప్రజలను భారీగా మోసం చేసే ఐదుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పడిన వారిలో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రై. లిమిటెడ్ సీఈఓ రాధేశ్యామ్, సన్ పరివార్ గ్రూపు సీఈఓ మెతుకు రవీందర్, ఈబిజ్.కామ్ ఎండి పవన్కుమార్ మల్హన్, హితిక్ మల్హన్ కుమార్, ఎఫ్ఎంఎల్సీ ఎండీ బన్సీలాల్ ఉన్నారు. వీరి మోసాలపై ఐటీ శాఖ, జీఎస్టీ, కార్పొరేట్ మంత్రిత్వ శాఖ, ఇతర ఏజెన్సీలకు లేఖలు రాసి.. వీరిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సిఫార్సు చేశారు.
షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలని ఆశపడే ప్రతి ఒక్క రూ మోసపోవడం ఖాయం. కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి. ఆశకు పోయి నష్టా న్ని తెచ్చుకోవద్దు. మల్టీలెవల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, రిఫెరల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ తదితర పేర్లతో చలామణి అయ్యే స్కీమ్ల్లో చేరవద్దు. ఈ స్కీములను నడిపించేవారు.. గృహిణిలు, పదవీ విరమణ ఉద్యోగు లు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తా రు. మీరు చేరండి.. మీరు మరో ఇద్దరిని చేర్పించండి .. మా వస్తువులు కొనండి.. మరికొందర్నీ మా వస్తువులను కొనుగోలు చేసేందుకు సభ్యులుగా చేర్పించాలంటూ మాయమాటలు చెప్పే స్కీమ్లను అసలు నమ్మొద్దు. అధిక వడ్డీ, భారీగా కమీషన్లు అంటే అది మోసపూరితమని గుర్తు పెట్టుకోవాలి. – సజ్జనార్, సైబరాబాద్ సీపీ