డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కాసేపటి కిందటే గవర్నర్ రాణీ మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఉత్తరాఖండ్లో నాయకత్వ మార్పుపై ఉదయం నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రి ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు. త్రివేంద్ర రావత్ పనితీరుపై అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేంద్ర స్థానంలో ధన్సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు నాయకత్వ మార్పు చేయడం గమనార్హం. అయితే ఇప్పుడా పార్టీ ఎవరినీ తీసుకొచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలవదని, రాష్ట్రంలో తమ ప్రభుత్వ పనితీరు సరిగా లేదని బీజేపీ నాయకత్వానికీ తెలుసని మాజీ సీఎం హరీష్ రావత్ అన్నారు.
మరొకరికి అవకాశం ఇవ్వాలనే..
రాజీనామా తర్వాత త్రివేంద్ర రావత్ మీడియాతో మాట్లాడారు. తాను చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, బీజేపీ తనకు ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పదవి ఎవరు తీసుకున్నా వాళ్లకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని అన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని ఆయన వెల్లడించారు.