కోల్కతా: వీధి కుక్కలకు ఆహారం వండి పెట్టి వాటి బాగోగులు చూసే ఒక వ్యక్తిపై స్థానికులు దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆ కుక్కలు కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించాయి. గమనించిన ఒక జంతు ప్రేమికురాలు వాటికి ఆహారం పెట్టారు. పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్కు చెందిన 53 ఏండ్ల రజత్ మొండల్ వీధి కుక్కలకు ఆహారం పెడుతూ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవారు. అయితే కుక్కల బెడదపై అసహనం వ్యక్తం చేసి స్థానికులు అతడిపై దాడి చేసి కొట్టారు. రజత్ చెయ్యి విరగడంతో మూడు వారాలపాటు ఆసుపత్రిలో ఉన్నారు.
అయితే వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని కోరుతూ తెలిసిన వ్యక్తి రజత్ తన ఇంటి తాళం ఇచ్చారు. అతడు పట్టించుకోకపోవడంతో ఆ కుక్కలు కొన్ని రోజులు ఆకలితో అలమటించాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న న్యూ అలీపోర్కు చెందిన జంతు ప్రేమికురాలు మీనాక్షి పాండేయ, రజత్ ఇంటికి వెళ్లి అక్కడి వీధి కుక్కల పరిస్థితి చూసి చలించిపోయారు. రజత్ వచ్చే వరకు ఆమె వాటిని ఆహారం పెట్టారు.
మరోవైపు రజత్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై జరిగిన దాడి గురించి సోనార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు తనపై దాడి జరుగడం ఇదే తొలిసారి కాదని ఆయన చెప్పారు. గతంలో పాతులి ప్రాంతంలో ఉండేవాడినని, కుక్కలకు ఆహారం పెట్టడంపై అక్కడి వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు.
కాగా, రజత్పై దాడి చేసినట్లు ఆరోపణలున్న స్థానికులు దీనిని ఖండించారు. ఆయనపై తాము దాడి చేయలేదని, అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.