న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎయిమ్స్ వైద్యశాల నర్సు పీ నివేద.. ప్రధానికి టీకా ఇచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని మోదీకి ఇచ్చినట్లు నర్సు నివేద తెలిపారు. మరో 28 రోజుల తర్వాత ఆయనకు సెకండ్ డోసు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. టీకా వేసుకున్న తర్వాత మోదీ తనతో మాట్లాడారని, టీకా వేసుకున్నట్లే తెలియలేదని మోదీ తనతో చెప్పినట్లు నర్సు తెలిపారు. లగా బీ దియా ఔర్ పతా బీ నహీ చలా అంటూ మోదీ ఆ నర్సుతో అన్నారు. నర్సు నివేద గత మూడేళ్ల నుంచి ఎయిమ్స్లో పనిచేస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రధాని మోదీ వస్తున్నట్లు తనకు ఇవాళ ఉదయమే తెలిసినట్లు ఆమె చెప్పారు. తనకు వ్యాక్సిన్ సెంటర్లో డ్యూటీ పడిందని, తనకు అధికారులు పిలిచారని, అయితే ప్రధాని మోదీ టీకా తీసుకునేందుకు వస్తున్నారని, ఆయన్ను కలుసుకోవడం సంతోషంగా ఉందని నర్సు నివేద తెలిపారు. నర్సు నివేదతో పాటు మరో నర్సు రోషమ్మ అనిల్ కూడా ఆ సమయంలో వ్యాక్సిన్ సెంటర్లో డ్యూటీలో ఉన్నారు. అయితే తాము ఏ ప్రాంతానికి చెందినవారని ప్రధాని తమను ప్రశ్నించినట్లు నర్సు నివేద తెలిపారు. మరో నర్సు రోషమ్మ అనిల్ కేరళ నివాసి. ప్రధాని మోదీని కలుసుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు. చాలా సంతోషంగా ఉందని, ప్రధాని కూడా ఎంతో ఈజీగా ఫీలయ్యారని ఆమె అన్నారు.