పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
గ్రామంలో అభివృద్ధి జోరు
వైకుంఠధామం ఏర్పాటుతో తీరిన చివరి మజిలీ వెతలు
కోటగిరి, మే 19:పల్లెప్రగతి కార్యక్రమం కొడిచర్ల గ్రామ రూపురేఖలను మార్చేసింది. ప్రభుత్వ సహకారం.. గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండడంతో పరిసరాలు శుభ్రంగా మారాయి. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టడంతో అంటురోగాలు దూరమయ్యాయి. పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న రకరకాల పూలమొక్కలతో ఆహ్ల్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో కాలనీలో రోడ్లు లేక బురదమయంగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీలకు నిధుల వరద మొదలైంది. కొడిచర్ల పంచాయతీకి నెలకు రూ.1.70 లక్షల చొప్పున ఏడాదికి రూ.20.40 లక్షలు నిధులు మంజూరు కావడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది.
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలోని అన్ని గల్లీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో కష్టాలు తీరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనం, పరిశుభ్రతతో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు 30 రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడింది. కొడిచర్లలో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. రూ.2లక్షలతో సీసీ డ్రైనేజీలు, రూ.3లక్షలతో మొరం వేయించారు. నూతన పంచాయతీ భవనం నిర్మించారు. ట్యాంకర్, ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేశారు. గ్రామం లో ప్రభుత్వ భూములు లేకపోవడంతో రూ.2లక్షలతో భూమిని కొనుగోలు చేసి పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
కొడిచర్ల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేం దుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామానికి నిధులు మంజూరవుతున్నాయి.