దేశానికే దిక్సూచిలా దళితబంధును అమలు చేయాలి
అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హాజరైన మంత్రి వేముల, ఎమ్మెల్యే షిండే, జడ్పీ చైర్పర్సన్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
సర్వే కోసం గ్రామ, మండలస్థాయిల్లో కమిటీలు : ఎమ్మెల్యే షిండే
నిజాంసాగర్, సెప్టెంబర్ 13: దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా మారాలని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సోమవారం అత్యున్నతస్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నుంచి మంత్రి ప్రశాంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దళితబంధు పథకం అమలుతీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని రెండు, మూడు వారాల్లో అమలు చేస్తామని స్పష్టంచేశారు. హుజూరాబాద్, వాసాలమర్రిలో ఇచ్చినట్లు దశలవారీగా దళితబంధు పథకం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదలచేస్తామని చెప్పారు. సీఎం సమావేశంతో పథకం అమలుపై మరింత స్పష్టత వచ్చినట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గ్రామ, మండలస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక సర్వే చేపడుతారని వెల్లడించారు.
దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఉద్యమం తరహాలో అమలుచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. దళితబంధు పథకం తీరుతెన్నులు, అమలుతీరుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని రెండు, మూడు వారాల్లో అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్, వాసాలమర్రిలో ఇచ్చినట్లు దశలవారీగా దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదలచేస్తామని అన్నారు. దేశంలో ఎవరూ చేయని వినూత్న ఆలోచనతో దళితబంధు అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో హుజూరాబాద్, వాసాలమర్రి తరహాలో మరో నాలుగు మండలాలను పైలట్ మండలాలుగా ఎంపికచేశామన్నారు.
వాటిలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంతో పాటు చింతకాని, తుంగతుర్తి, చారగొండ మండలాలు ఉన్నాయన్నారు. నలు దిశలు పథకాన్ని చాటేందుకు నాలుగు మండలాలను ఎంపిక చేశామని చెప్పారు. దళిత జాతిలో పేదరికాన్ని రూపుమాపేలా పథకాన్ని పక్కాగా అమలయ్యేలా తీసుకునే చర్యలపై చర్చించారు. అవసరమైతే దళిత యువకులకు అవకాశం ఉన్న రంగంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగించి వారికి ఆ పథకాన్ని అందించేలా చేయాలని సూచించారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా నుంచి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభరాజు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలో 1604 కుటుంబాలకు లబ్ధి
దళితుల మనోభావాలు, వారి స్థితిగతులు, అర్థిక పరిస్థితులను పరిశీలించి పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. హుజూరాబాద్ తరహాలోనే రెండు మూడు వారాల్లో దశల వారీగా నిధులు మంజూరు చేస్తామని దళిత బంధు పథకం కోసం బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో వారికి ఇష్టమైన, వచ్చిన పనులను చేసుకోవాలని కోరారు. పథకం విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. దేశానికే దిక్సూచిలా అమలు చేయా లన్నారు. నిజాంసాగర్ మం డలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 1604 దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.
నిజాంసాగర్ ఎంపిక అదృష్టంగా భావిస్తున్నా..
సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దళితబంధు పథకం ప్రవేశపెట్టడం అభినందనీయం. సీఎంతో జరిగిన సమావేశంలో గ్రామస్థాయిలో ఆరుగురితో కూడిన ఒక కమిటీ, మండల స్థాయిలో 15 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ దిశగా కమిటీ ఏర్పాటు పూర్తవుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారం రోజుల్లో సర్వే ప్రారంభిస్తాం. ఈ సర్వేలో నిధుల వినియోగంపై వివరాలు తెలుసుకుంటారు. పదిహేను రోజుల్లో కమిటీల ఏర్పాటుతోపాటు సర్వే కూడా పూర్తిచేస్తాం. అప్పటి వరకు కొంతమేరకు నిధులు కూడా విడుదలవుతాయి. దళితులకు రూ. 10 లక్షలతోపాటు దళితకాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం.