నీటమునిగిన రెండు మోటర్లు
పరిశీలించిన అధికారులు
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 13 : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా 21వ ప్యాకేజీ కింద సారంగాపూర్ వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్ పంపుహౌస్లోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు మోటర్లు నీట మునిగాయి. అక్టోబర్ నెలలో వెట్న్ నిర్వహించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో వరదనీరు పంపుహౌస్లోకి చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో వెట్న్ డిసెంబర్కు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, మెట్పల్లి నియోజకవర్గాల్లో రెండు లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో బినోల సమీపంలో గోదావరి బ్యాక్వాటర్ను సొరంగం ద్వారా సారంగాపూర్ పంపుహౌస్లోకి తరలించే పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
భారీ వరద కారణంగా..
బినోల సమీపంలో గోదావరి బ్యాక్వాటర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరం వరకు అప్రోచ్ చానల్ను నిర్మించారు. మార్గమధ్యంలో 1.5 కిలోమీటర్ వద్ద వాటర్ కంట్రోలింగ్ కోసం హెడ్ రెగ్యులెటర్ను ఏర్పాటు చేసి, 333.4 మీటర్ల ఎత్తులో బ్రెస్ట్వాల్వ్ నిర్మించారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ లెవల్ 332.540 మీటర్లకు చేరి బ్రెస్ట్వాల్వ్ వద్దకు నీటి ఉధృతి వచ్చి చేరింది. నెల 8న ఈ నీరు బ్రెస్ట్వాల్వ్ గేటు పైనుంచి అప్రోచ్ చానల్, 18 కిలోమీటర్ల దూరం ఉన్న సొరంగం ద్వారా పంపుహౌస్లోకి వెళ్లింది.
డీ-వాటరింగ్ చేయాల్సిందే..
పంపుహౌస్లోకి చేరిన నీటిని డీ-వాటరింగ్ చేసిన అనంతరం రెండు మోటర్లను చూస్తే గానీ ఎంతమేరకు నష్టం జరిగిందనే విషయం స్పష్టమవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా వర్షాలు కురుస్తున్నందున డీ-వాటరింగ్ పనులు ప్రారంభిస్తే మొత్తం నీటిని తరలించడానికి 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సీఈ మధుసూదన్రావు సందర్శన..
పంపుహౌస్లోకి నీరు చేరిన విషయం తెలుసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ మధుసూదన్రావు, ఎస్ఈ బద్రీనారాయణ, ఈఈ ఉదయ్కుమార్, డీఈ బలరాం, ఏఈ భుజేందర్ అక్కడికి వెళ్లి సందర్శించారు. పంపుహౌస్తోపాటు బినోల హెడ్ రెగ్యులేటర్లనూ వారు పరిశీలించారు. బ్రెస్ట్వాల్వ్ గేట్ల పైనుంచి నీరు బయటికి వచ్చిన విధానాన్ని సీఈ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు.