టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఇద్దరు శాసనసభ్యులు
మాడుగులపల్లికి జీవన్రెడ్డి, తిరుమలగిరి సాగర్కు జాజాల
అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్న నేతలు
గెలుపు దిశగా సాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిజామాబాద్, ఏప్రిల్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుసగా ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ విజయకేతనం ఎగురవేసేదిశగా అడుగులు వేస్తున్నది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రస్తుతం సాగర్ ఉపఎన్నికల ప్రచారంలోనూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు దూసుకెళ్తున్నారు. మాడుగులపల్లి, తిరుమలగిరి సాగర్ మండలాలకు ఇన్చార్జీలుగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్లను పార్టీ నియమించింది. ప్రచార బాధ్యతల్లో ఇరువురు నేతలు బిజీగా గడుపుతున్నారు.
వరుస ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోరులోనూ సత్తా చాటనుంది. నోముల నర్సింహయ్య మరణంతో ఏర్పడిన ఉప పోరులో ఆయన కుమారుడు నోముల భగత్ గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో గులాబీ పార్టీ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండగా… నాగార్జున సాగర్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్లను నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు పార్టీ అధిష్టానం ఇన్చార్జీలుగా నియమించింది. నెల రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కారు పార్టీ గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ తిరుగుతూ, శ్రేణులతో వరుస భేటీలు నిర్వహిస్తూ సమన్వయంతో సాగుతున్నారు.
వ్యూహాత్మకంగా ప్రజల్లోకి…
ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే వ్యూహాత్మక అడుగులు వేసిన గులాబీ పార్టీ… ప్రతీ ఓటరును కలుస్తూ చేసిన అభివృద్ధిని కండ్లకు కడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమదైన శైలిలో ఓటర్లను కలుస్తూ నోముల భగత్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాడుగుల పల్లి మండలంలో ఇప్పటికే గ్రామ స్థాయిలో నాయకులతో సమన్వయ భేటీలు నిర్వహించిన జీవన్ రెడ్డి వారందరితో నిత్యం ఫోన్లో సంప్రదింపులు జరుపుతూ ఇతర పార్టీలకు దీటుగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ సైతం తనకు అప్పగించిన తిరుమలగిరి సాగర్లోనూ గిరిజన గూడేల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. గిరిజన ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా చేకూరుతున్న లబ్ధిని వివరిస్తున్నారు. ఈ మధ్యనే టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ్యత్వాల వివరాల ఆధారంగా గ్రామ స్థాయిలో గులాబీ సైన్యాన్ని బలంగా నిర్మించారు. వారందరితో నిత్యం టచ్లో ఉంటూనే కాంగ్రెస్, బీజేపీల కంటే వేగంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ అమలైన పథకాలు, నాగార్జున సాగర్లో నోముల నర్సింహయ్య నేతృత్వంలో జరిగిన అభివృద్ధి తీరును ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. చేసింది చెబుతూనే ఓట్లు అడుగుతున్నారు. గణాంకాలతో అభివృద్ధి తీరును ప్రజలకు వివరిస్తూ ఓట్లను అడుగుతున్నారు.
టీఆర్ఎస్కే ప్రజల మద్దతు
నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు సీరియస్గా దృష్టి సారించాయి. వరుసగా ఓటమి పాలవుతున్న కాంగ్రెస్, బీజేపీలు తమ పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డిని గెలిపించుకునేందుకు హస్తం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాడోపేడో అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకే నల్లగొండ జిల్లా ప్రజల మద్దతు ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు ఓటమిని ముందే గ్రహించి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక బీజేపీకి చివరి దాకా అభ్యర్థి దిక్కు లేకపోవడంతో పాటు ప్రచారంలో ఎక్కడా ప్రజల నుంచి స్పందనే రావడం లేదు. అసలు ఉప ఎన్నికల పోటీలో కమలం పార్టీ ఉన్నట్లుగా ప్రజలు భావించడం లేదంటూ విశ్లేషణలు సైతం వస్తున్నాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నది. గులాబీ నాయకులతో సోషల్ మీడియా బృందాలను యాక్టివ్లోకి తీసుకు వచ్చారు. బీజేపీ చెప్పే అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునివ్వడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికేదైనా ప్రచారంలో మనోళ్లు…
సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్నది. ఏ ఎన్నిక వచ్చినా ప్రచార పర్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులకు క్రియాశీలక బాధ్యతలు దక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొవిడ్ 19 తీవ్రరూపంలో ఉన్న సమయంలోనూ ఉభయ జిల్లాలకు చెందిన నాయకులు తమ సత్తా చాటా రు. రాష్ట్ర మంత్రి వేముల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి సత్తా చాటారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మాడుగులపల్లి మండలానికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్కు తిరుమలగిరి సాగర్ మండలానికి ప్రచార ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించడంతో మరోమారు సాగర్ పోరులో ఇందూరు నేతలు సత్తా చాటబోతుండడం విశేషం.
భారీ విజయం సాధిస్తాం…
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాం. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు డిపాజిట్లు దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి. కేసీఆర్ సారథ్యంలో, కేటీఆర్ మార్గదర్శకంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నది. ఏప్రిల్ 17న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఏకపక్షంగా ఓట్లు పడడం ఖాయం. టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయం వరించడం తథ్యం. జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి.
ఇవి కూడా చదవండి
కూలర్ కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..
18 ఏండ్లు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు!
త్వరలోనే ప్రకటించనున్న ప్రభుత్వం: జయేశ్రంజన్
కరోనా సెకండ్ వేవ్..ఇకపై వరుసగా వాయిదాలు చూడాలా..?
జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!