నేడు హల్దీవాగులోకి గోదావరి జలాలు ..
రోజుకు 1600 క్యూసెక్కుల నీటి విడుదల
సిద్దిపేట జిల్లాలోని తొమ్మిది చెక్డ్యాములు నిండి..
మెదక్ జిల్లాలో ప్రవేశించనున్న గోదారమ్మ
సిద్దిపేట, మార్చి9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హల్దీవాగు నుంచి మంజీర మీదుగా 90 కిలోమీటర్ల దూరంలోని నిజాం సాగర్కు గోదావరి జలాలు నింపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నది. వారం రోజుల్లో నిజాంసాగర్కు గోదావరి జలాలు చేరుకుంటాయి. రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. ఇప్పటికే బందం చెరువు, పెద్దచెరువు, ధర్మాయి చెరువు నిండాయి. ఖాన్ చెరువు అలుగు పారి హల్దీవాగులోకి నేడు గోదావరి జలాలు చేరుతాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీవాగు, అక్కడి నుంచి మంజీరా నదికి, అక్కడి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు మరో వారం రోజుల్లో తరలనున్నాయి. ఇప్పటికే సుమారు 6కిలోమీటర్లు ప్రయాణించి నాలుగు చెరువులను నింపి శనివారం హల్దీవాగులోకి గోదావరి జలాలు ప్రవేశించనున్నాయి. సంగారెడ్డి కెనాల్ నుంచి తొలుత 1.20 కి.మీ దూరంలోని చౌదరిపల్లి బంధం చెరువులోకి నీళ్లు వెళ్లాయి. ఈ చెరువు సామర్ధ్యం 12 ఎంఎస్ఎఫ్టీ కాగా, 118 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నిండి అలుగు పారడంతో 2.60 కిలోమీటర్ దూరంలో ఉన్న వర్గల్ పెద్ద చెరువులోకి గోదావరి నీళ్లు వెళ్లాయి. ఈ చెరువు కెపాసిటీ 10 ఎంఎస్ఎఫ్టీ, దీనికింద 90 ఎకరాల ఆయకట్టు ఉంది. జలాల రాకతో ఈ చెరువు కింద ఉన్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. ఈ చెరువు అలుగు పారడంతో అక్కడి నుంచి 1.36కి.మీ దూరంలోని శాకారం ధర్మాయి చెరువులో గోదారమ్మ జలసవ్వడి చేసింది. ఈ చెరువు సామర్ధ్యం 15ఎంఎస్ఎఫ్టీలు కాగా, 140 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 1.15 కిలోమీటర్ల దూరంలోని అంబర్పేట ఖాన్ చెరువులోకి గోదావరి జలాలు చేరుతున్నాయి. శనివారం తెల్లవారుజాము వరకు ఆ చెరువు అలుగు పారి హల్దీవాగులోకి గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. ఖాన్చెరువు కెపాసీటి 58 ఎంఎస్ఎఫ్టీ కాగా, దీనికింది 580 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక హల్దీవాగులో గోదారమ్మ పరుగులు పెట్టి నాచారం లక్ష్మీనర్సింహా స్వామి సన్నిధి నుంచి మెదక్ జిల్లాలోకి ఆదివారం వరకు ప్రవహించే అవకాశాలున్నాయి. సంగారెడ్డి కెనాల్ ప్రారంభ సమయంలో కేవలం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూడు రోజులుగా నీళ్లు ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో, శుక్రవారం నుంచి నీటి విడుదలను 1600 క్యూసెక్కులకు పెంచారు. దీంతో నీటి ప్రవాహం పెరగడంతో చెరువులు, చెక్డ్యాంలు త్వరగా నిండుతున్నాయి.
హల్దీవాగుపై చెక్డ్యాలు …
గోదారమ్మ గలగల పరుగులు తీస్తూ హల్దీవాగు మీదుగా మంజీరను ముద్దాడి నిజాంసాగర్లోకి ప్రవహించనున్నది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కలుపుకొని మొత్తం 70 కిలోమీటర్లు ప్రవహించి 32 చెక్డ్యాంలను నింపి మంజీరా నదిలోకి జలాలు వెళ్తాయి. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి జలాలు వెళ్తాయి. హల్దీ వాగుపైన 32 చెక్డ్యామ్లు ఉన్నాయి. హల్దీవాగుకు నీటిని విడుదల చేయడంతో ఈ వాగు పరీవాహక ప్రాంత పంటలకు జీవం పోసినట్లయ్యింది.
కండ్లారా చూసే అవకాశం దక్కింది
కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా నిజాంసాగర్కు మళ్లించడం మాములు విషయం కాదు. గోదావరి జ లాలను కండ్లారా చూసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయ కట్టు కింద సాగు నీరు సక్రమంగా అందక సగమే పం టలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు రెండు పంటలను పండించే రోజులు వచ్చాయంటే ఆనందంగా ఉన్నది.
మాకు ఎటువంటి ఫికర్ లేదు..
మన రాష్ట్రం మనకు వస్తే ఏమస్తదో సీఎం కేసీఆర్ చెప్పిండు. నేడు అదే నిజమయితుంది. మన రాష్ట్రం మనకు అచ్చుట్లనే గోదావరి నీళ్లు నిజాంసాగర్కు మళ్లిస్తుండ్రు. మరో పది దినాలల్ల నిజాంసాగర్కు నీళ్లస్తయి. ఇక మాకు ఏం ఫికర్ లేదు. రెండు పంటలను సాగు చేసుకుంటాం. నాకు నిజాంసాగర్ ఆయకట్టు కింద మూడెకరాల భూమి ఉంది.