సమాచార లోపంతోనే రైతుల్లో ఆందోళన
1600 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం
మూడు రోజుల్లో జిల్లాకు మరో 4442 మెట్రిక్ టన్నుల యూరియా
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందూరు, ఆగస్టు 4 : యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డితో బుధవారం ఆయన సెల్కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ రాములు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. పలుచోట్ల తనిఖీలు చేపట్టి స్టాక్ వివరాలను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో అవసరం మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ముందుగానే యూరియాను తెప్పిస్తున్నామని, అందుబాటులో ఉన్నచోట అధికారులను సంప్రదించి తీసుకోవాలని రైతులకు సూచించారు. సమాచార లోపంతోనే కొందరు రైతులు రోడ్డెక్కారని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన సెల్కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఎరువుల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో సాగుపనులు ముమ్మరంగా కొనసాగు తున్నాయని, దీంతో ఒక్కసారిగా యూరియా అవసరం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఎంతమాత్రం ఎరువల కొరతలేదన్నారు. సహకార సంఘాలకు బుధవారం 640 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 640, ఆగ్రోస్కు 320 మెట్రిక్ టన్నులు పంపించామని తెలిపారు. అదేవిధంగా జిల్లాకు మూడు రోజుల్లో 4442 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. బుధవారం 1600 మెట్రిక్ టన్నులు, గురువారం 1200, శుక్రవారం 1642 మెట్రిక్ టన్నులు రైల్వే వ్యాగన్ల ద్వారా రానున్నాయని వివరించారు. సహకార సంఘాలు, డీలర్లు, ఆగ్రోస్ వద్దకు వ్యవసాయాధికారులు, తహసీల్దార్లు వెళ్లి ప్రతిరోజూ స్టాక్ వివరాలను రైతులకు తెలిసేలా, సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. దీనిని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. యూరియా విషయంలో మంత్రి ప్రశాంత్రెడ్డి తనతో ఫోన్ ద్వారా మాట్లాడారని కలెక్టర్ తెలిపారు. సెల్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, డీసీవో సింహాచలం, ఆర్డీవోలు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, వ్యవసాయాధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.