నిజామాబాద్కు మూడు, కామారెడ్డికి ఒకటి మంజూరు
కాలనీల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
పెద్ద దవాఖానలకు పరుగులు తీయాల్సిన అవసరమే లేదిక..
పల్లె దవాఖానల మాదిరిగానే ఏర్పాటు కానున్న బస్తీ వైద్యశాలలు
నిజామాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆది నుంచీ వైద్యరంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కేసీఆర్ కిట్ వంటి పథకాలతో సర్కారు వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పట్టణాల్లో చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు వైద్యసేవలు అందించే లక్ష్యంతో హైదరాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకూ వాటి సేవలను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కామారెడ్డిలో ఒకటి, నిజామాబాద్లో మూడు బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యరోగ్య సేవలు మెరుగయ్యాయి. ప్రభుత్వ దవాఖా నల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందుతున్నా యి. కేసీఆర్ కిట్ వంటి పథకాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీర్ఘకాలిక రోగాలకు సైతం జనరల్, జిల్లా, ఏరియా వైద్యశాలల్లో చికిత్సలు అందిస్తున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వినూత్నంగా ఆలోచించారు. హైదరాబాద్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు రావడంతో రాష్టవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అమలుకు శ్రీకా రం చుట్టారు. ఇప్పటికే బస్తీ దవాఖానల మాదిరిగానే గ్రామాల్లోనూ పల్లె దవాఖానలు ప్రారంభిస్తున్నారు. మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానలు నెలకొల్పడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల పరంగా కొండంత ధైర్యం దక్కనున్న ది. కామారెడ్డిలో ఒకటి, నిజామాబాద్లో మూడు బస్తీ దవాఖానలు మంజూరు కాగా… ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోయేది త్వరలోనే వెల్లడి కానున్నది.
ప్రైవేటులో విపరీతంగా దోపిడి…
జ్వరమొచ్చి ప్రైవేటు దవాఖానలకు వెళ్తే కన్సల్టేషన్ ఫీజు రూపంలో రూ.300 కట్టించుకుంటున్నారు. డాక్టర్ చూడకుండానే మందులు రాసిచ్చి మెడికల్ షాపులో రూ.వేలల్లో బిల్లు చెల్లించుకునేలా చేస్తున్నారు. సామాన్యులు ఎవరైనా మెరుగైన వైద్యం పేరిట ప్రైవేటు దవాఖానల్లో అడుగుపెడితే జేబులు గుల్ల చేసుకుని రావాల్సిందే. ఇక వైద్య పరీక్షల పేరిట చీటీలు రాస్తే ఇక అంతే సంగతి. అందుకే… ప్రైవేటు దోపిడీ నుంచి రక్షణగా పల్లె, బస్తీ దవాఖా నలు అనేక విధాలుగా ప్రజలకు మేలు చేకూర్చను న్నాయి. వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలోనూ సుదూర ప్రాంతాల్లోని పెద్ద దవాఖానలకు తరలివెళ్లాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వైద్యులు అరకొరగా అందుబాటులో ఉంటున్నారు. గ్రామీణులకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యులను నియమించబోతున్నది. పట్టణ ప్రాంతాల్లోనూ బస్తీ దవాఖానలు రావడంతో పేదలకు ఊరట కలుగనున్నది.
కాలనీల్లోనే వైద్య సేవలు
ఆయా మున్సిపాలిటీ పరిధిలో అనువుగా ఉండే భవనాలు, స్థలాలు సమకూర్చే బాధ్యత ఆయా మున్సిపాలిటీలదే. పురపాలిక అధికారులు భవనాలు చూపించి మౌలిక వసతులు కల్పించి ఇస్తే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో మూడు, కామారెడ్డి జిల్లాలో ఒక బస్తీ దవాఖాన ఏర్పాటుకు నిర్ణయించారు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా పేద, మధ్య తరగతి ప్రజలు పెద్దాసుపత్రులకే వెళ్తున్నారు. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తే చిన్న సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి వైద్యసేవలు పొందడం సులువు అవుతుంది. పల్లె దవాఖానల్లోనూ ఇలాంటి సేవలే అందుబాటులోకి రానున్నాయి. ఈ దవాఖానల్లో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, ఒక ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తారు. ప్రాథమిక చికిత్స, మాతా శిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకు వైద్య సేవలు అందనున్నాయి. 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ అక్కడే నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలకు పంపుతారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులతో పాటు ఇతర మందులు సైతం బస్తీ దవాఖానల్లోనే అందించనున్నారు.
ప్రజారోగ్యం పరిరక్షణ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25.51 లక్షల జనాభా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 47 వరకు ఉన్నాయి. నిత్యం దవాఖానల్లో 10వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. బస్తీ, పల్లె దవాఖానలు మనుగడలోకి వస్తే పేదలపై వైద్య భారం తగ్గనున్నది. ప్రస్తుతం గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు ఇష్టానుసారంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. పట్టణాల్లో ప్రైవేటు వైద్యశాలలు సైతం భారీగా దోపిడీ చేస్తున్నాయి. గ్రామ, పట్టణ స్థాయి లో వైద్యం పేరిట జరుగుతున్న భారీ దందాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. మెరుగైన వైద్యం పేదలకు చేరువ చేసేందుకు సర్కారు దవాఖానల్లో పలు పథకాలను ఇప్పటికే ప్రవేశ పెట్టింది. ఇప్పుడు పట్టణాల్లోని కాలనీల్లో వైద్య సేవలందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నది. సత్వరమే వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో కొన్ని చోట్ల పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వీటి మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె, బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు ఉపశమనం
బస్తీ దవాఖానలపై త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పల్లె దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. పల్లె, బస్తీ దవాఖానల ద్వారా ప్రైవేటులో ఓపీ సేవల పేరిట జరిగే దోపిడీ నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు, వైద్యం అందుబాటులోకి రావడంతో పేదలకు మేలు జరుగుతుంది.