పొరుగు రాష్ర్టాలతో పరేషాన్
స్వీయ నియంత్రణ, టీకాతోనే కట్టడి
కామారెడ్డి, జనవరి 4 : కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. అమెరికా నుంచి ఇటీవలే ఎల్లారెడ్డికి వచ్చిన వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కలకలం రేపింది. రెండేండ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను వెంటాడుతూనే ఉంది. వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ మహమ్మారి రూపు మార్చుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మూడో వేవ్ కోరలు చాస్తోంది. ఇప్పటికే పక్కనే గల మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలతో పాటు మన రాష్ట్రంలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
పొరుగు రాష్ర్టాలతో పొంచి ఉన్న ముప్పు
విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడంతో జిల్లాలో కలవరం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దులో కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ముప్పు పొంచి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్, బి చ్కుంద, మద్నూర్, జుక్కల్ తదితర ప్రాంతాల నుంచి రవాణా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల గుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు ఇరువైపులా రాకపోకలు సాగుతుంటాయి. దీంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
టీకానే అస్త్రం
కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇటీవల వరకు 18 ఏండ్లు పైడిన వారందరికీ టీకాలు వేయగా రెండు రోజులుగా 15-18 సంవత్సరాల వయస్సు వారికీ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
అప్రమత్తత అవసరం
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చు. మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించాలి. ముందస్తు జాగ్రత్తలతో కరోనా తరిమికొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
విద్యానగర్, జనవరి 4 : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. ఆయనకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండడంతో శాంపిళ్లను హైదరాబాద్కు పంపారు. మంగళవారం వచ్చిన రిపోర్టుల్లో ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళన చెందు తున్నారు.