లాభాల దిశగా సంస్థ
కార్గో ద్వారా రూ. 60లక్షల ఆదాయం
పార్సిల్ ద్వారా రూ. 3.40కోట్ల రాబడి
సంబురాలు చేసుకుంటున్న ఆర్టీసీ సిబ్బంది
ఖలీల్వాడి, జనవరి 4: టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశ గా సంస్థ వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ ప్రతిష్టను పెంచేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. అదే సమయంలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో సంస్థ ముందుకెళ్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్ ఆర్టీసీని నష్టాలనుంచి గట్టెక్కించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్త ప్రయోగాలను విజయవంతం చేస్తూ సంస్థను లాభాల్లోకి తెస్తున్నారు. అటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే ఇటు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2020 నుంచి కార్గో సర్వీసులను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరుకులు, పార్సిళ్లు, కొరియర్ సౌకర్యాన్ని కల్పించారు. పంట ఉత్పత్తులనూ రవాణా చేసేందుకు కార్గో వసతిని కల్పించారు. తక్కువ చార్జీతో వేగంగా గమ్యస్థానానికి సరుకులు చేరుతుండడంతో ప్రజలు ఆర్టీసీ ద్వారానే కొరియర్, పార్సిల్ చేయడం ఆరంభించారు. దీంతో కార్గో సౌకర్యం ప్రారంభించిన ఏడాదిలోనే ఆర్టీసీ లాభాల బాట మొదలైంది. నిజామాబాద్ రీజియన్లో 11 ఆర్టీసీ, ఐదు ప్రైవేటు సెంటర్ల ద్వారా 2022 జనవరి 3 నాటికి 3,46,343 పార్సిల్, కొరియర్లను బుకింగ్ చేయగా, రూ.3,40,27,445 ఆదాయం సమకూరింది. ఆర్టీసీ కార్గో బస్సు సేవలను 2020 జూలై మొదటి వారంలో ప్రారంభించగా 2022 జనవరి 3 నాటికి రీజియన్ పరిధిలో రూ.91,22,313 ఆదాయం వచ్చింది. పార్సిల్, కొరియర్, కార్గో సర్వీసులు కలిపి మొత్తం రూ. 4,31,49,758 ఆదాయం సాధించింది. కొరియర్, పార్సిళ్లలో నిజామాబాద్ డిపో-1 రూ.2,13,92,858 ఆదాయం
తెచ్చి రీజియన్లోనే మొదటి స్థానంలో నిలిచింది. కార్గో బస్సు సేవల్లో కామారెడ్డి డిపో రూ.49,82,377 ఆదాయంతో మొదటి స్థానం సాధించింది.
వినూత్న కార్యక్రమాలు..
ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డిగోవర్ధన్, ఎండీ సజ్జనార్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. సంస్థను లాభాల దిశగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన చర్యలు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఆన్లైన్ బుకింగ్..
విజయవాడ, తిరుపతి, బెంగళూరు, వింజమూరు, ఉదయగిరి, హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
శుభకార్యాలకు.. పండుగలకు
శుభకార్యాలు, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నది. కిలోమీటర్కు సరిపడా చార్జీలను మాత్రమే తీసుకొని ఇటు ప్రయాణికులకు, అటుసంస్థకు లాభం చేకూరేలా సేవలందిస్తున్నారు. పెండ్లి కోసం ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే వధూవరులకు ప్రత్యేక బహుమతిని అందజేస్తున్నారు. దీంతో పెండ్లి మండపంలో నలుగురికీ ఆర్టీసీ సేవలు తెలుస్తున్నాయి. పండుగ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సులే కాకుండా 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే బస్సును పంపించే కొత్త పథకాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా బాలల దినోత్సవం, న్యూఇయర్ సందర్భంగా 0-12ఏండ్లలోపు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.
అందరి కృషి ఫలించింది..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభించిన కార్గో, పార్సిల్, కొరియర్ సేవలతో టీఎస్ ఆర్టీసీకి లాభం వస్తున్నది. అందరి కృషితోనే ఈ ఫలితం వచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాపారవేత్తలకు చెందిన వస్తువులను భద్రంగా గమ్యానికి చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటే సంస్థకు మేలుచేసినవారవుతారు.