బాన్సువాడ, జనవరి 4: వ్యవసాయ రంగంలో రైతుబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రైతుబంధు ఉత్సవాల నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, నాయకులతో మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అత్యుత్తమ వ్యవసాయ ప్రోత్సాహక పథకాల్లో రైతుబంధును చేర్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది విడుతల్లో రైతుబంధు పథకం ద్వారా రూ. 50వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. పంటల సాగు పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయకుండా, సొంత పెట్టుబడితో సేద్యం చేసేందుకు రైతుబంధు ఎంతగానో ఉపయోగకరంగా మారిందన్నారు. రైతుబంధు అమలు అనంతరం రైతుల ఆర్థిక ఇబ్బందులు తీరాయన్నారు. రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా రైతులు, నాయకులు సంబురాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. పథకం గురించి అవగాహన కల్పించే దిశగా రైతులు, ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రతి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
రైతు బంధు ద్వారా గ్రామాల్లో ఇప్పటివరకు రైతులు పొందిన లబ్ధి వివరాలను ఫ్లెక్సీల ద్వారా వెల్లడించాలని వ్యవసాయ శాఖ అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఈనెల 10న గ్రామాల్లో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు చేపడుతూ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలన్నారు. అంగన్వాడీల నూతన భవన నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వీసీలో ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.