బాన్సువాడ రూరల్, జనవరి 4: రాష్ట్రంలో రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చేస్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. సోమవారం మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రపంచంలోనే గొప్ప పథకాలుగా మిగిలిపోనున్నాయని అన్నారు. పెట్టుబడిసాయం కింద ప్రభుత్వం అందిస్తున్న డబ్బులతో రైతులు సకాలంలో పంటలు వేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారని అన్నారు. సోమేశ్వర్ గ్రామంలో 439 మంది రైతులకు ఎనిమిది విడుతల్లో ఇప్పటి వరకు రైతుబంధు పథకం ద్వారా రూ. కోటీ అరవై లక్షల ముప్పై వేలు అందుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది రైతులు మరణించగా వారి నామినీలుగా ఉన్న కుటుంబ సభ్యులకు రైతుబీమా పథకం కింద రూ. 5లక్షల చొప్పున రూ. 45లక్షలు చెల్లించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ రమణ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ, బాన్సువాడ విండో అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, నాయకులు మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి బుల్లెట్ రాజు, రాజేశ్వర్ గౌడ్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, గంగుల గంగారాం, మలేశం, మొగులయ్య పాల్గొన్నారు.