పక్షవాతం నయం చేస్తామంటూ గ్రామాల్లో తిరుగుతున్న ముఠా
నకిలీ వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 2 : పక్షవాతం నయం చేస్తామంటూ కొన్ని రోజులుగా నకిలీ వైద్యులు గ్రా మాల్లో తిరుగుతూ అందినకాడికి దండుకుంటున్నా రు. భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పైడి సాయిరెడ్డి భార్య లక్ష్మికి పక్షవాతం నయం చేస్తామని వారం రోజుల క్రితం రూ.30 వేలు వసూలు చేశారు. మరుసటి రోజు నుంచి వారి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బాధితులు సోమవారం భిక్కనూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు తిరుగుతూ రోగాలను నయం చేస్తామంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. ఇలాంటి అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచితుల మాటలు నమ్మవద్దన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, బైక్ ఫొటోలను గ్రామాల్లో సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా సేకరించామన్నారు. భిక్కనూరు మండలంతో పాటు రాజంపేట, దోమకొండ, రామా యంపేట్, కామారెడ్డి ప్రాంతాల్లో వీరు తిరిగారని వివరించారు. వీరి ద్వారా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.