ఇందూర్, జూలై 31 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో హరితహారంపై అధికారుతో మాట్లాడారు. జిల్లాలోని ప్రతి రోడ్డులో ఈనెల 13వ తేదీనాటికి అవె న్యూ ప్లాంటేషన్ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 500 జనాభా ఉన్న ప్రతి జీపీకి ప్రభుత్వం కార్యదర్శులను నియమించిందని, ప్రతిరోడ్డు పక్కన మొక్కలు ఉండే విధంగా కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలన్నారు. అవసరమైతే మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. 3 మీటర్లకు ఒక మొక్క ఉండేలా ఏఈలు మానిటర్ చేయాలని ఆదేశించారు. నాలుగు వందల మొక్కలకు ఒక వాచ్ అండ్ వార్డు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, పంచాయతీరాజ్ ఏఈలు పాల్గొన్నారు.
పక్కాగా హెల్త్ సర్వే
జిల్లాలో ఈనెల 3 నుంచి హెల్త్ సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. హెల్త్ సర్వేపై శనివారం ఆయన సెల్కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతోమాట్లాడారు. సర్వేలోభాగంగా కొవిడ్-19, టీబీ, లెప్రసీ, హెచ్ఐవీ, తలసేమియా, డయాలసిస్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారి పూర్తి వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. 3వ తేదీన ఉదయం 7 గంటలకే సంబంధిత అన్ని పీహెచ్సీలకు సూపర్వైజర్లు, అధికారులు, ఎంపీడీవోలు, మెడికల్ అధికారులు, ఐసీడీఎస్, ఇతరశాఖల అధికారులు చేరుకోవాలని, ప్రణాళికా ప్రకారం సర్వేకు వెళ్లాలని అన్నారు. గ్రామపంచాయతీ స్థాయిలో మూడు రోజుల్లో, మున్సిపాలిటీ స్థాయిలో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్లతోపాటు డీపీవో జయసుధ, డీడబ్ల్యూవో ఝాన్సీ, ఇన్చార్జి డీఎంహెచ్వో సుదర్శనం పాల్గొన్నారు.