బోధన్, జూలై 31: బోధన్ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం కౌన్సిలర్లు శనివారం రభస సృష్టించారని చైర్పర్సన్ తూము పద్మావతి శరత్రెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్ సోయెల్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్ గేట్ వద్ద ఎంఐఎం కౌన్సిలర్లు ఆందోళనకు దిగి చైర్పర్సన్, వైస్ చైర్మన్, అధికారులను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎంఐఎం కౌన్సిలర్ల ఆందోళన సద్దుమణిగింది. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులకు శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ఎజెండాలో నిధుల కేటాయింపులు లేవని ఆరోపిస్తూ ఎంఐఎం కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాలేదు. అనంతరం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 58 ఎజెండా అంశాలను పాలొన్న కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకే..
సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి శరత్రెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్ సోయెల్ మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎంఐఎం కౌన్సిలర్లు రభస సృష్టించారని ఆరోపించారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు సమదృష్టితో జరుగుతోందని, మైనార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం కౌన్సిలర్ల వార్డుల్లో సైతం పట్టణ ప్రగతి పనులే కాకుండా, జనరల్ ఫండ్తో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. శనివారం నాటి కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం కౌన్సిలర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న 2,5,6,7 వార్డుల్లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ఆమోదించామన్నారు. టీఆర్ఎస్ మైనార్టీ కౌన్సిలర్లకు సంబంధించిన 8 వార్డులకు ఒక్కో వార్డుకు రూ.5 లక్షలు కేటాయించామన్నారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పట్టణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. ఎంఐఎం కౌన్సిలర్లు తమ వార్డులకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించడం తగదన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, సమావేశం దృష్టికి తీసుకురావాలని, సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఎవరెన్ని చేసినా పట్టణాభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, డేగావత్ దూప్సింగ్, బెంజర్ గంగారాం, కొండ్ర పద్మ, గాండ్ల సుధారాణి, తోకల లక్ష్మి, పిట్ల సత్యనారాయణ, జావీద్, ఇంతియాజ్, అబ్దుల్లా, హమీద్, ఖమరున్సీసా బేగం, షమ్సున్సీనా బేగం పాల్గొన్నారు.