డిచ్పల్లి: వేగ నియంత్రణ కోసం పోలీస్ శాఖ లేజర్ గన్నుతో నిఘాను ఏర్పాటు చేసింది. 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ జోన్ల వద్ద మాత్రమే లేజర్ గన్తో నిఘాను ఏర్పాటు చేశారు. ప్రమాదసూచికల సిగ్నల్ వద్ద స్పీడ్ 80 దాటితే లేజర్ గన్ ఆటోమెటిక్గా వాహన ఫొటోను తీస్తుంది. వెహికిల్ నంబర్ ఆధారంగా వాహనదారుడికి రూ.1035లు జరిమానా విధిస్తూ వాహనదారుడి సెల్ఫోన్కు ఫొటోతో పాటు చలానా మెస్సేజ్ రూపంలో వెళ్తుంది. దీంతో పాటుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి యజమాని ఇంటి అడ్రస్కు పోస్టల్ ద్వారా చలానా కాపీ వెళ్తుంది.
నిజామాబాద్ జిల్లాలో మూడు చోట్ల మాత్రమే లేజర్ గన్తో ఓవర్ స్పీడ్ వెళ్లే వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ఏసీపీ ట్రాఫిక్ ప్రభాకర్రావు, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తరచూ జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు. రహదారులపై విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లేజర్ గన్ వినియోగంపై అవగాహన సైతం కల్పిస్తున్నారు. నిబంధనలకు మించి అతివేగంగా వెళ్లే వాహనాలను నియంత్రించే అంశాలపై అవగాహనను ఏసీపీ ప్రభాకర్రావు కల్పించారు.
లేజర్ గన్ వినియోగంతో సత్ఫలితాలు..
జిల్లాలో లేజర్గన్ వినియోగంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వాహనదారులకు ఓవర్ స్పీడ్కు అడ్డుకట్టపెట్టేందుకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రమాద సూచికల సిగ్నల్స్ వద్ద స్పీడ్ను తగ్గిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60కిలోమీటర్ల పొడవున 254 ప్రమాద హెచ్చరిక బోర్డులను, 54 సోలార్ విగ్గర్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కనీసం వందకు పైగా ఓవర్ స్పీడ్ వెళ్తున్న వాహనాలను లేజర్ గన్ ఫొటోలు తీస్తుంది.
ప్రమాదాల నివారణ కోసమే : ట్రాఫిక్ ఏసీపీ, ప్రభాకర్రావు
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే జాతీయ రహదారులపై లేజర్ గన్ను వినియోగిస్తున్నాం. యాక్సిడెంటల్ జోన్ల వద్ద ఓవర్ స్పీడ్గా వెళ్తున్న వాహనదారులను లేజర్ గన్ ఇట్టే గుర్తించి ఫొటోలు తీస్తుంది. లేజర్ గన్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేదు. స్పీడ్ లిమిట్ను దాటిన ప్రతి వాహనాన్ని లేజర్ గన్ గుర్తిస్తుంది. దీని ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా ఉండే అవకాశం ఉంది.
సిబ్బందికి అవగాహన కలిపిస్తున్నాం: చందర్ రాథోడ్, ట్రాఫిక్ సీఐ
రహదారులపై ఏర్పాటు చేసిన లేజర్ గన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు అవగాహన కలిపించాం. వాహనాలను ఫొటోలు తీయడం, అప్లోడ్ చేసే విధానంపై ఇదివరకే పూర్తిస్థాయిలో అవగాహన కలిపించాం. దీంతో రహదారులపై ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డిచ్పపల్లి సర్కిల్లో నాలుగు బ్లాక్ స్పాట్స్ : రఘునాథ్, డిచ్పల్లి సీఐ
డిచ్పల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు బ్లాక్ స్పాట్లను గుర్తించాం. అందులో బీబీపూర్ తండా (మోడల్ స్కూల్) వద్ద, 44వ జాతీయ రహదారి డిచ్పల్లి ఏడవ బెటాలియన్ వద్ద, సికింద్రాపూర్, అర్గుల్ వద్ద ఈ జోన్న్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ లేజర్ గన్తో నిఘాను ఏర్పాటు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.