మిషన్ భగీరథతో డీఫ్లోరైడ్ స్కీం అనుసంధానం
75 గ్రామాలకు శుద్ధజలం సరఫరాకు సిద్ధం
వేసవిలో దాహం తీర్చేందుకు అధికారుల సన్నాహాలు
త్వరలో ఇంటింటికీ తాగునీరు
నవీపేట, ఏప్రిల్ 15:సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్వహణ వైఫల్యం కారణంగా నిరుపయోగంగా మిగిలిన యంచ డీఫ్లోరైడ్ స్కీమ్కు పునర్వైభవం రానున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి యంచ డీఫ్లోరైడ్ స్కీమును అనుసంధానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 75 గ్రామాలకు శుద్ధజలం అందనుంది. నవీపేట మండలంలోని 57 గ్రామాలకు, రెంజల్ మండలంలోని 18 గ్రామాలకు భగీరథ నీటిని అందించేందుకు అధికారులు పనులను వేగవంతం చేశారు. రూ.21.32 కోట్లతో 41 కొత్త వాటర్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. త్వరలోనే నీటిసరఫరా ప్రారంభిస్తామని, వేసవిలో తాగునీటి సమస్య ఇక ఉండబోదని అధికారులు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తరచూ పైప్లైన్ లీకేజీలతో నిర్వహణ సరిగాలేక మరుగున పడిన యంచ డీఫ్లోరైడ్ స్కీమ్ను ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో 75 గ్రామాలకు శుద్ధజలం అందనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయా గ్రామాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి యంచ డీఫ్లోరైడ్ స్కీమ్ను అనుసంధానం చేస్తే వేసవిలో ఇకనుంచి తాగునీటి సమస్య ఉండదని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
నవీపేట మండలంలోని 57 గ్రామాలు, రెంజల్ మండలంలోని 18 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు అధికారులు పనులను వేగవంతం చేశారు. నవీపేట మండలంలోని 57 గ్రామాల్లోని 14,756 కుటుంబాలకు నీటి సరఫరా కోసం ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేశారు. ఇప్పటికే వాటర్ను టెస్టింగ్ కూడా పూర్తిచేశారు. ఇందులో భాగంగా మండలంలో 41 కొత్త వాటర్ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణానికి రూ.21.32 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.
దాహం తీర్చనున్న ‘మిషన్ భగీరథ’..
ఎండలు ముదురుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుత వేసవినుంచి నవీపేట, రెంజల్ మండలాల ప్రజల దాహం తీర్చనుంది. త్వరలోనే ఇంటింటికీ శుద్ధజలాలు సరఫరా కానున్నందున ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన యంచ డీఫ్లోరైడ్ స్కీమ్ను ప్రస్తుతం అన్ని హంగులు, రంగులతో ప్రారంభానికి సిద్ధం చేశారు.
నీటి సరఫరా ఇలా..
యంచ సమీపంలోని గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి నేరుగా స్టోరేజ్ ట్యాంక్లోకి తరలిస్తారు. అక్కడి నుంచి ఫిల్టర్ బెడ్(పంప్హౌస్)లో శుద్ధిచేసి, నేరుగా యంచ గుట్టపై నిర్మించిన ట్యాంకులోకి లిఫ్ట్ చేస్తారు. ఈ ట్యాంకు ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లోని వాటర్ట్యాంకులకు, అక్కడి నుంచి ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు.
త్వరలోనే ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు..
త్వరలో నవీపేట మండలంలోని 57 గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తిచేశాం. మొత్తం 14,756 ఇండ్లకు నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చాం. ఇప్పటికే పైప్లైన్ ద్వారా టెస్టింగ్ పూర్తిచేశాం. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.
-రాము, ఏఈ, మిషన్ భగీరథ