కామారెడ్డి టౌన్, జూన్ 16: పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్లకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పక్కాగా చేపట్టాలన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తోపాటు వివిధ శాఖలకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో మాట్లాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పక్కాగా చేపట్టాలన్నారు. ఏ రోజు చెత్త ఆ రోజే తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అదనపు కలెక్టర్లకు నూతన వాహనాలను అందించామని, ఎమర్జెన్సీ నిధుల కింద వారికి రూ. 25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో సీఎం నూతన జిల్లా కలెక్టరేట్, పోలీసు ప్రారంభోత్సవాలకు రానున్నారని, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి. వెంకట మాధవరావు, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, డీపీవో సునంద, జిల్లా ట్రాన్స్కో అధికారి శేషారావు, ఏపీడీ సాయన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.