బాన్సువాడ/బీర్కూర్/నాగిరెడ్డిపేట్, జూలై 27 : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనం ఎత్తుకొని ఉత్సవాల్లో పాల్గొన్నారు. నల్లపోచమ్మకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డీజే చప్పుళ్ల మధ్య మహిళలు నృత్యాలు చేశారు. ఎంపీపీ దొడ్ల నీరజ, బల్దియా చైర్మన్, వైస్చైర్మన్లు జంగం గంగాధర్, జుబేర్, సొసైటీ అధ్యక్షులు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు పాత బాలకృష్ణ, దాసరి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కొర్ల పోతారెడ్డి, మహ్మద్ ఎజాస్, నార్ల ఉదయ్గుప్తా, కటికె రమేశ్, శ్రీనివాస్, రాజాగౌడ్, ముదిరెడ్డి విఠల్రెడ్డి పాల్గొన్నారు.
బీర్కూర్లో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలను ఎత్తుకొని కామప్ప చౌరస్తా నుంచి బారడి పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి.. అమ్మవారికి సమర్పించారు. సర్పంచ్ ఆవారి స్వప్న బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలం వెంకంపల్లి గ్రామంలో బోనాలను ఉరేగింపుగా తీసుకెళ్లి పోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శుభాకర్రెడ్డి, తాండూర్ సింగిల్విండో చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.