బీర్కూర్/ సదాశివనగర్, మార్చి 12 : మండలాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అధికారులకు సంబంధించిన సమాచారం లేకుండా పోతున్నది. ఒకవేళ ఉన్నా పాత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. అధికారులు మారినా.. బోర్డులను మార్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్, సమాచార అధికారిగా పనిచేసిన భరత్కుమార్.. నిజామాబాద్ కలెక్టరేట్కు వెళ్లారు. ఆయన స్థానంలో భానుప్రకాశ్ వచ్చి చాలారోజులు కావస్తున్నా సమాచార హక్కు చట్టం బోర్డుపై పేరు మార్చలేదు. తహసీల్ కార్యాలయంలో అసలు సమాచార హక్కు చట్టం బోర్డు కూడా లేదు.
సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమాచార హక్కు చట్టం అధికారుల పేర్లు, సెల్ నంబర్లను రాయించారు. అధికారులు బదిలీపై వెళ్లి ఏండ్లు కావస్తున్నా వివరాలను మార్చలేదు. ఎంపీడీవోగా పనిచేసి గతేడాది మృతిచెందిన అశోక్, ఈవోపీఆర్డీగా (ఎంపీవో)గా పనిచేసి ఏడాది క్రితం బదిలీపై వెళ్లిన సతీశ్, ఆరునెలల క్రితం బదిలీపై వెళ్లిన కార్యదర్శి పద్మ పేర్లు బోర్డుపై అలాగే ఉండడంతో గ్రామస్తులు అయోయానికి గురవుతున్నారు.
అధికారులు స్పందించి ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లను బోర్డులపై రాయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.