కామారెడ్డి టౌన్, జూలై 27: జిల్లాలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల సమావేశ మందిరంలో పల్లెప్రగతి పనులపై మంగళవారం అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఆగస్టు 10వ తేదీలోపు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. కిలోమీటర్కు రెండు వేల మొక్కలను నాటి వాచర్లను నియమించాలని సూచించారు. రైతులు పొలం గట్లపై మొక్కలు నాటేవిధంగా చూడాలని కోరారు. పెండింగ్లో ఉన్న శ్మశానవాటిక, కంపోస్టు షెడ్లు పూర్తిచేసి వాడుకలోకి తేవాలన్నారు. కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువులను తయారుచేసి రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పల్లెప్రకృతి వనాలు వందశాతం వాడుకలోకి తీసుకురావాలన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ప్రతిగ్రామంలో వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించి 25 మొక్కలు నాటాలని, దాతల సహకారంతో వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్లు సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో పంచాయతీ అధికారిణి సునంద, ఏపీడీ సాయన్న, డీఎల్పీవోలు సాయిబాబా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.